Ajay bhupathi | టాలీవుడ్లో విభిన్న కథలను తెరకెక్కించే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ టాలీవుడ్లో కథానాయికగా అరంగేట్రం చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటించడంతో సినిమాపై విడుదలకు ముందే ఆసక్తి ఏర్పడింది. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేశాయి. కొత్త హీరో, హీరోయిన్తో పాటు భారీ తారాగణం ఉండటంతో ప్రేక్షకుల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
జయకృష్ణ, రాషా థడానీ తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లోనూ తమ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే కథనం నెమ్మదించడం, స్క్రీన్ప్లేలో వేగం లోపించడం, కథలో ఆశించిన స్థాయిలో కొత్తదనం కనిపించకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది. దీంతో తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘శ్రీనివాస మంగాపురం’ ఫలితంపై దర్శకుడు అజయ్ భూపతి స్పందించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాకపోతే దర్శకులు పలు కారణాలను ప్రస్తావిస్తుంటారు. కానీ అజయ్ భూపతి మాత్రం ఎలాంటి కారణాలను చూపకుండా సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్లో సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ ప్రయాణంలో ఎన్నో మంచి అనుభవాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు దక్కాయని తెలిపారు. ముఖ్యంగా డెబ్యూ హీరో జయకృష్ణ, రాషా థడానీలతో కలిసి పనిచేసిన సమయంలో వారు కొత్తవారనే భావన తనకు కలగలేదని.. ఇద్దరూ తమ వంతు కష్టాన్ని వంద శాతం పెట్టారని ప్రశంసించారు. అలాగే ఈ ప్రాజెక్ట్లో భాగమైన నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అజయ్ భూపతి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్తో కలిసి పనిచేసే అవకాశం రావడం గర్వంగా ఉందని చెప్పారు. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరి సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.‘శ్రీనివాస మంగాపురం’ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత మెరుగ్గా తిరిగి వస్తానని ప్రకటించారు. ప్రేక్షకులను మెప్పించే మరో మంచి సినిమాతో త్వరలోనే తన సత్తా చూపిస్తానని హామీ ఇచ్చారు.