న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు వెల్లడించింది. మీనాక్షీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. తప్పుడు రీతిలో మీనాక్షి నామినేషన్ను తిరస్కరించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. కానీ రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎలక్షన్ పిటీషన్ నమోదు చేయాలని మీనాక్షికి సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణకు ఆమోదించింది.
మధ్యప్రదేశ్లో మూడు రాజ్యసభ సీట్ల కోసం జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ అకస్మాత్తుగా మీనాక్షీ నటరాజన్ పిటీషన్ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి జలక్ తగిలింది. మీనాక్షి అసంపూర్ణంగా డాక్యుమెంట్లు సమర్పించిన అరవింద్ శర్మ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తనపై కోర్టు కేసు ఉన్న విషయాన్ని ఆమె ఫామ్ 26లో పొందుపరచలేదని ఆర్వో తెలిపారు.
2025 అక్టోబర్లో హైదరాబాద్ కోర్టుకు నోటీసుకు నటరాజన్ స్పందించారని, కానీ ఫామ్ 26లో ఈ విషయాన్ని చెప్పలేదని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. తెలంగాణలో మీనాక్షీపై కేసు నమోదు అయ్యిందని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 8వ తేదీన నామినేషన్ ఫైలింగ్కు చివరి తేది. మంగళవారం రోజున ఆ పేపర్లను స్క్రూటినీ చేశారు.