Ameesha Patel | ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అమీషా పటేల్ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 51 ఏళ్ల వయసులోనూ అవివాహితగా కొనసాగుతున్న ఆమె, పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్ జీవితంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్లో ఓ అభిమాని.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని ప్రశ్నించాడు. దీనికి ఏమాత్రం సందేహించకుండా అమీషా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్గా చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు చాలామంది ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం నా జీవితాన్ని, నా ఆనందాన్ని పూర్తిగా మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు అని ఆమె సమాధానం ఇచ్చారు. అమీషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె అభిప్రాయానికి కొందరు నెటిజన్లు మద్దతు తెలుపుతూ.. ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా గడిపే హక్కు ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి అనేది పరస్పర అవగాహన, ప్రేమ, సహజీవనానికి ప్రతీక అని అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో అమీషా పటేల్ తన ప్రేమ జీవితం గురించి కూడా మాట్లాడారు. సినీ రంగంలోకి రావడం తన అప్పటి ప్రియుడికి ఇష్టం లేకపోవడంతో ఆ బంధం ముగిసిందని ఆమె వెల్లడించారు. ఆ అనుభవం తన జీవితంలో చాలా విషయాలు నేర్పిందని చెప్పారు. అలాగే, తన కెరీర్ను అర్థం చేసుకుని ప్రోత్సహించే వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచించేవారినని, కానీ అలాంటి మానసిక పరిణతి ఉన్న భాగస్వామిని కనుగొనడం సులభం కాదని పేర్కొన్నారు. వయసు కంటే వ్యక్తిత్వం, ఆలోచనా విధానమే ముఖ్యమని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.అమీషా పటేల్ ఇటీవల సన్నీ డియోల్ సరసన నటించిన ‘గదర్ 2’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. సకీనా పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. అనంతరం ‘తౌబా తేరా జల్వా’ చిత్రంలో కనిపించిన అమీషా, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్లపై దృష్టి సారిస్తున్నారు.