Kasi Majili Kathalu Episode 26 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : తండ్రి కంట పడకుండా తననెక్కడైనా దాచిపెట్టమని చంద్రలేఖను వేడుకున్నాడు రుచికుడు. దాంతో ఆ వేశ్య అతడిని ఒక తోటలో దాచిపెట్టి తాళం వేసింది. రాజభటులతో వచ్చిన ఆ తండ్రికి ఎంత వెతికినా కొడుకు కనిపించలేదు సరికదా.. దాచిపెట్టిన చంద్రలేఖకు కూడా అతడి జాడ తెలియలేదు. కొంతకాలానికి రుచికుని స్నేహితుడైన గౌతమునివల్ల తిలోత్తమ అనే రాజకన్య రుచికుణ్ని చూసినట్లు తెలిసింది. దాంతో ఆ రాజ్యానికి వెళ్లి రాకుమార్తెతో స్నేహం చేయసాగింది చంద్రలేఖ.
శూరసేనుని బావమరిది పేరు బలసింహుడు. అతను విరాటపర్వంలో కీచకుని వంటివాడు. తిలోత్తమ చెలికత్తెగా ఉన్న చంద్రలేఖను చూసి మతి పోగొట్టుకున్నాడు. ఎలాగైనా ఆమెను పొందాలనే తీవ్రమైన కోరికను అణచుకోలేకపోయాడు. మంధర అనే పరిచారికను చంద్రలేఖ వద్దకు రాయబారం పంపాడు. బలసింహునికి చంద్రలేఖను దారికితెచ్చేందుకు మంధర శక్తివంచన లేకుండా కృషి చేసింది. కానీ చంద్రలేఖ ఒప్పుకోలేదు.
“నా మనసు రుచికునికి అంకితమైంది. అతడిని తప్ప మరొకరిని నేను అంగీకరించలేను” అని తెగేసి చెప్పింది.
“నీలాంటి వారకాంతకు ఇలాంటి పాతివ్రత్యం తగునా? మా రాకుమారి తిలోత్తమ తన కలలో కనిపించినవాడిని తప్ప వేరెవరినీ వరించనని మంకుపట్టు పట్టుకొని కూర్చున్నది. ఆమెలా నువ్వు కూడా చెడిపోకు. బలసింహుడిని చేపట్టు. నువ్వు కోరుకుంటే ఆయన ఈ రాజ్యాన్ని కూడా నీ కాళ్లముందు పెట్టగలడు” అన్నది మంధర.
చంద్రలేఖ ఆ మాటలకు అంగీకరించకపోగా, మంధరపై కన్నెర్రజేసి తన ముందునుంచి తరిమి కొట్టింది. మొహం వేలాడేసుకుని వచ్చిన మంధరకు బలసింహుడు ఏదో బహుమానం ఇచ్చి సాగనంపాడు. కానీ, తనలో పెరుగుతున్న మన్మథ తాపాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ పట్టణంలో శకునాలు చెప్పే ఒక యోగిని వద్దకు వెళ్లాడు.
“కనకం చేతిలో పడకుండా కోరుకున్న కాంత నీ వశం కాబోదురా!” అన్నది యోగిని.
బలసింహుడు ఇచ్చిన భారీ బహుమానాన్ని జోలెలో దాచుకుని.. విబూది చేతిలోకి తీసుకుని మంత్రించి, బలసింహుని చేతిలో పోసింది యోగిని
“రాజపుత్రా! ఈ విబూదిని నువ్వు కోరుకున్న చిన్నదాని నెత్తిన చల్లు. ఆమె పెంపుడుకుక్కలా నీకు వశమైపోతుంది. నిన్ను సుఖపెడుతుంది” అన్నది.
అప్పటికప్పుడే చంద్రలేఖ తనకు వశమైనంతగా సంబురపడిపోయాడు బలసింహుడు. అంతఃపుర పరిచారికలకు ముడుపులు అందించి, ఆ రాత్రికే రహస్యంగా చంద్రలేఖ గదిలోకి చేరుకున్నాడు. ఆమె గాఢనిద్రలో ఉండగా తన చేతిలోని బూదిని ఆమె నుదుటిమీద రుద్దాడు. విబూది ముక్కుపుటాలకు సోకడం వల్ల చంద్రలేఖ గట్టిగా తుమ్మింది. నిద్రాభంగమైంది. ఎదురుగా ఉన్న బలసింహుడిని పోల్చుకోలేక.. “ఎవరూ!?” అన్నది కండ్లు నులుముకుంటూ. “నేను నేను.. నాతో రా! వచ్చెయ్!” అంటూ బలసింహుడు మరికొంచెం విబూదిని ఆమె నెత్తిమీద చల్లాడు. చంద్రలేఖ భయంతో దొంగ దొంగ అని కేకలుపెట్టింది. బలసింహుడు ఒక్క ఉదుటన అక్కడినుంచి బయటికి పరుగెత్తాడు. పనిచెయ్యని బూడిదనిచ్చి సొమ్ము కాజేసినందుకు మంత్రగత్తెను తెగతిట్టుకున్నాడు. ‘రాజపుత్రికతో స్నేహం కుదరబట్టి కదా.. ఈ బోగపుసానికి ఇంత పొగరు?! దీని పని పడతాను’ అని మనసులో గట్టిగా శపథం చేసుకున్నాడు.
* * *
ఒకరోజున చంద్రలేఖ, తిలోత్తమ కలిసి పట్టణానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో కొన్నిరోజులు గడపడానికి వెళ్తున్నారని బలసింహునికి తెలిసింది. వెంటనే తనకు అత్యంత సన్నిహితులైన మర్కటుడు, మారీచుడు అనే గజదొంగలను రహస్యంగా తన వద్దకు పిలిపించుకున్నాడు. వాళ్లకు కర్తవ్యబోధ చేశాడు. దాని ప్రకారం, నడిరాత్రి ఉద్యానవనంలో గాఢ
నిద్రలో ఉన్న చంద్రలేఖను వాళ్లిద్దరూ కలిసి మంచంతో సహా ఎత్తుకువచ్చి అతని ముందు ఉంచారు. చీకటి మాటున మంచంమీద చంద్రలేఖకు బదులుగా తిలోత్తమను చూసి బలసింహుడు అదిరిపడ్డాడు.
“ఒరే మొద్దు వెధవల్లారా! చంద్రలేఖను తెమ్మంటే దీన్ని తెచ్చారేంట్రా?! మా బావకు తెలిస్తే నా తల తెగ్గోస్తాడు. పోండి.. దీనికి మెలకువ రాకముందే తీసుకుపోయి తోటలో దింపేసి రండి!” అంటూ హడావుడి పడ్డాడు.
మంచాన్ని భుజాలకు ఎత్తుకుని, దొంగలిద్దరూ మళ్లీ ఉద్యానవనం వైపు వెళ్తుండగా.. వారికి ఓ పెళ్లిమేళం ఎదురుపడింది. దాన్ని తప్పించుకోవడానికి మరోవీధికి మళ్లారు. ఆ వీధిలో రాజభటుల పహారా గట్టిగా ఉంది. ఆ వీధినుంచి మరోవీధికి మళ్లేసరికి అక్కడ మరో సమస్య ఎదురైంది. అలా తెల్లవారేవరకూ ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే వచ్చింది. దాంతో వేరేదారి లేక వాళ్లిద్దరూ తిలోత్తమ పడుకొని ఉన్న మంచంతో సహా అడవిదారి పట్టారు.
* * *
తెల్లవారింది. తిలోత్తమ కనిపించక పోయేసరికి చంద్రలేఖ బేజారెత్తిపోయింది. చెలికత్తెలందరినీ అప్రమత్తం చేసి, తోటంతా వెతికించసాగింది. ఈలోగా కావలివాళ్లు దొంగలు తోటగోడకు కన్నం వేశారని కేకలు వేశారు. శూరసేనుడు భార్యతోసహా వచ్చాడు. ప్రధానమంత్రి ఆ సంఘటన గురించి ఆరా తీయసాగాడు.
అప్పుడు బలసింహుడు ముందుకువచ్చి.. “బావగారూ! ఈ బోగందానితో మన తిలోత్తమ సావాసం చేస్తుంటే మీరే ఉపేక్షించారు. నేనేం చేయగలనని ఇన్నాళ్లూ నోరు మెదపలేదు. దీనిని ఉంచుకున్నవాడు మన తిలోత్తమపై మనసు పడ్డాడట. తన విటునికి మన పిల్లను కూర్చడానికే ఇది మన రాజ్యంలో అడుగుపెట్టింది” అన్నాడు.
“అవును మహారాజా! ఆమెకు రోజూ ఎక్కడెక్కడినుంచో ఉత్తరాలు వస్తుంటాయి. ఒకనాడు అనుకోకుండా ఒక ఉత్తరం నా చేతిలో పడింది. అందులో ఇప్పుడు మన బలసింహులవారు చెప్పిన విషయాలే ఉన్నాయి” అంటూ మంధర కూడా సాక్ష్యం పలికింది.
“ఏదా ఉత్తరం?” అని అడిగాడు మంత్రి.
“ఆమె నా దగ్గరనుంచి లాగేసుకుందండీ!” అని సమాధానం ఇచ్చింది మంధర.
“దీనికి నువ్వు చెప్పుకొనేదేమైనా ఉందా?!” అని చంద్రలేఖను ప్రశ్నించాడు మంత్రి.
“నేను ఇలాంటి పని చేసివుంటానని మీకు తోస్తే నన్ను శిక్షించండి. నా ప్రాణమిత్రురాలైన తిలోత్తమకు అపకారం కలిగిందన్న వార్తకంటే పెద్దశిక్ష నా దృష్టిలో ఏదీ లేదు” అంటూ చంద్రలేఖ తలదించుకుంది.
ఆమె ఏ నేరమూ చేయలేదని తెలిసినా, వేరే మార్గం లేకపోవడం వల్ల శూరసేనుడు ఆమెకు అరణ్యవాస శిక్ష వేశాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నిర్జనారణ్యంలో విడిచిరమ్మని రాజభటులకు ఆజ్ఞ వెలువడింది.
పాపం చంద్రలేఖ.. రుచికుని కోసం ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఇన్ని ఇక్కట్ల పాలైంది. ఆపదలు కలగాల్సి ఉంటే ఎక్కడ తలదాచుకున్నా తప్పించుకోలేం. రాజభటులు అడవికి తీసుకొని వచ్చేటప్పుడే చంద్రలేఖకు స్పృహ తప్పింది. ఆమె ఏ క్రూరమృగం బారినైనా పడితే మరిణించి ఉండేదే. కానీ, భటులను వెంబడించి వచ్చిన బలసింహుడు, ఆమె కట్టుతాళ్లు విడిపించాడు. ఆమెకు మెలకువ తెప్పించే ప్రయత్నం చేయబోయాడు. వాడి ప్రారబ్ధం ఏమిటో కానీ, ఆ సమయంలోనే వేటకు వచ్చిన కిరాతుడొకడు బలసింహుడిని మృగం అనుకున్నాడు. వాడిగా ఉన్న ఊచతో కొట్టాడు. ఆ దెబ్బతో బలసింహుడు.. “హా! చంద్రలేఖా!” అని అరుస్తూ నేలకొరిగాడు. మనిషి కేక విన్న కిరాతుడు అయిపు లేకుండా పారిపోయాడు. బుట్టలోని పాము ఒకటి ఆకలిబాధకు తట్టుకోలేక చచ్చిపోబోతున్నదట. అదే సమయంలో బుట్టకు కన్నంపెట్టిన ఎలుక ఒకటి లోపలికి వచ్చింది. పాముకు ఆహారంగా చిక్కింది. దాన్ని హాయిగా ఆరగించిన పాము, ఎలుక పెట్టిన కన్నం ద్వారా బుట్టలోనుంచి బయటపడిందట. అలా.. బలసింహుని అరుపుతో మెలకువ వచ్చిన చంద్రలేఖ.. తనముందు బలసింహుడు చచ్చిపడి ఉండటం చూసింది. జరిగిందంతా ఊహించ గలిగింది. దైవానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని, అక్కడినుంచి కదిలింది.
* * *
అడవిలో అనేక కష్టాలు పడుతూ చివరికి త్రిగర్తదేశపు రాజధాని అయిన అలకాపురానికి చేరుకుంది. తాను అలంకరించుకున్న మణిభూషణం ఒకదానిని అమ్మివేసింది. పురుషవేషానికి తగ్గట్లు దుస్తులు కొనుక్కుని, తన రూపం మార్చుకుంది. వీరగుప్తుడు అనే పేరుతో ఒక సత్రంలో ప్రవేశించింది. కొన్నిరోజులు అక్కడే కాలం గడిపింది.
ఇదిలా ఉండగా.. కొంతకాలం కిందటే ఆ రాజ్యపు మంత్రి కాలధర్మం చెందాడు. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న ధర్మాంగదుడనే రాజు కొత్తమంత్రి కోసం విచిత్రమైన పరీక్షలు పెట్టాడు. ఎవ్వరూ ఆ పరీక్షల్లో నెగ్గకపోయేసరికి మంత్రిస్థానం ఖాళీగా ఉండిపోయింది.
దాంతో. ‘నా చిత్తవృత్తిని అనుసరించి, నేను అడిగే ప్రశ్నలకు ఎవరైతే సమాధానం ఇస్తారో.. వారికి మంత్రి పదవి ఇస్తాం’ అని ధర్మాంగదుడు ఒక ప్రకటన పత్రిక రాయించి, కోటగుమ్మం వద్ద వేలాడగట్టాడు. ఒకనాడు పట్టణమంతా తిరుగుతూ, అక్కడికి వెళ్లిన చంద్రలేఖ.. తన పేరు వీరగుప్తుడని, తాను మహారాజు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని ఒక సందేశం రాసి రాజు వద్దకు పంపింది.
‘ప్రవేశపెట్టండి’ అని రాజు అనుమతిచ్చాడు.
వీరగుప్తుడు వస్తున్నప్పుడే అతడి ముఖవిలాసం, నేత్రసౌష్టవం చూసి మనసులో.. ‘ఆహా! ఇతడు మంత్రిగా కాదు, రాజుగా ఉండటానికి కూడా అర్హుడే’ అనుకున్నాడు ధర్మాంగదుడు.
అతడిని ఉద్దేశించి.. “వీరగుప్తా! నిన్నొక్కటే ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబితే నిన్నే మంత్రిగా నియమిస్తాను” అన్నాడు.
“చిత్తం మహారాజా!” అన్నాడు వీరగుప్తుడు.
అప్పుడు ధర్మాంగదుడు ఎండవేడిమికి తన నుదుట పట్టిన చెమటను తుడుచుకున్నట్లు అభినయించాడు. ఒకపక్క పరిచారకులు వింజామరలను వీస్తున్నప్పటికీ గాలి చాలక, ఉత్తరీయంతో విసురుకుంటూ..
“పన్నెండులోనుంచి నాలుగు తీసివేస్తే ఎంత?” అని అడిగాడు. వీరగుప్తుడు ఎక్కువసేపు ఆలోచించలేదు.
“సున్నా మహారాజా! ఏమీ మిగలదు” అన్నాడు.
ధర్మాంగదుడికి బ్రహ్మానందం వేసింది. వీరగుప్తుడిని మంత్రిగా నియమిస్తూ ఆజ్ఞాపత్రిక వెలువరించాడు.
సభలో ఉన్నవారే కాకుండా, మంత్రి స్థానానికి పోటీపడిన అనేకమంది కూడా ఈ వార్త తెలిసి ఆశ్చర్యపోయారు. కొందరు తెలివైనవారు మాత్రం.. ‘పన్నెండు అంటే పన్నెండు మాసాలని అర్థం. నాలుగంటే నాలుగు మాసాల వర్షాకాలం. ఏడాదిలో వర్షాకాలాన్ని తీసివేస్తే పంటలు సున్న. అందుకే పన్నెండులోనుంచి నాలుగు తీసేస్తే సున్న అని వీరగుప్తులవారు సమాధానం ఇచ్చారు’.. అని ఆ సన్నివేశాన్ని విశ్లేషించారు.
ఏమైతేనేం.. వీరగుప్తుడు త్రిగర్తకు మంత్రిగా నియమితుడు అయ్యాడు. అది మొదలు దేశం సుభిక్షం అయింది. పాడిపంటలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ధర్మాంగదుడు రాజ్యభారాన్ని వీరగుప్తునిపై వేసి హాయిగా ఉన్నాడు.
అలా ఉండగా ఒకనాడు, వీరగుప్తుడు నగర పర్యటన చేస్తున్నాడు. ఒక వీధివెంట వెళ్తుండగా అతడి చెవులకు వసంతకోకిల కాకలీనాదాన్ని మేలమాడగలిగేంత చక్కనైన పాట ఒకటి వినిపించింది.
ఒక పరిచారకుడిని పిలిచి.. “అక్కడేదో సంగీతం వినవస్తున్నది. అదేమిటో కనుక్కురా!” అన్నాడు.
వాడు చప్పున పోయి..
“దేవరా! ఇక్కడికి దగ్గరలో తారకేశ్వరాలయం ఉంది. మంటపంలో ఒక భక్తురాలు ఏవో పాటలు పాడుకుంటున్నది” అని తాను చూసి వచ్చిన సంగతి చెప్పాడు.
వెంటనే రథం దిగి, వీరగుప్తుడు ఆలయంలోకి వెళ్లాడు. ముఖమంటపంలో తంత్రీనాదంతో కంఠ స్వరాన్ని మేళవించి మనోహరంగా పాడుతున్న భక్తురాలివంక కొంతసేపు రెప్పవాల్చకుండా చూశాడు. కన్నులవెంట ఆనందబాష్పాలు జాలువారుతుండగా ఉత్తరీయంతో తుడుచుకున్నాడు. ఇంతలో గుడి ధర్మకర్తలు హడావుడి పడుతూ వచ్చి మంత్రిహోదాకు తగిన మర్యాదలు చేశారు. రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు ధరించిన భక్తురాలు అదేమీ గమనించకుండా తనధోరణిలో మరో రెండు శివకీర్తనలు పాడింది. అవిరెండూ చంద్రలేఖ రచించినవే. ఆమె సాక్షాత్తూ తిలోత్తమే! పాట ముగియగానే తిలోత్తమ లోపలికి వెళ్లేందుకు సిద్ధపడింది. ఆమెను నిలువరించి.. “అమ్మాయీ! ఇంత చిన్నవయసులో ఈ వైరాగ్యం ఏమిటి? ఎవరు నువ్వు?! ఎందుకిలా మారావు?! నన్ను పరాయిదాన్ని అనుకోకు” అన్నాడు వీరగుప్తుడు. తిలోత్తమ ఆశ్చర్యపడి చూస్తుండగా తనను తాను సవరించుకుని.. “అదే.. నన్ను పరాయివాణ్నిగా అనుకోకు. నీ సోదరునిగా భావించి, నీకు కలిగిన కష్టమేమిటో చెప్పు” అని అడిగాడు. అప్పుడు తిలోత్తమ తన కథను ఇలా చెప్పసాగింది.
(వచ్చేవారం.. ఎగిరే చెట్లు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు