సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా అనుమానం వచ్చిన వాహనాన్ని నిలిపివేసి పత్రాలన్నింటినీ పరిశీలిస్తారు. కానీ ఇప్పుడు అన్ని వాహనాలను పరిశీలించి ఏదో ఒక అంశంలో జరిమానాయే లక్ష్యంగా పనిచేయాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
టార్గెట్లు రీచ్ కావడానికి చిన్న చిన్న తప్పిదాలను కూడా అధికారులు ఫైన్లు వేస్తున్నారు. ఎలాగైనా టార్గెట్ రీచ్ కావాలంటూ ఉన్నతాధికారులు సైతం ప్రతీరోజు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఉదయం, రాత్రి తేడా లేకుండా వాహన తనిఖీల్లో అధికారులు నిమగ్నమయ్యారు. గడువు తీరిన, లైసెన్స్లేని, ఓవర్ లోడ్, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల వాహనాల రాకపోకలపై దృష్టి సారించారు.
ప్రస్తుతం చెక్పోస్టులు ఎత్తివేయడంతో అక్కడ పనిచేసిన ఉద్యోగులను, ఆర్టీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలతో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేశారు. జరిమానాలు చెల్లించకుండా ఉన్న వాహనదారుల వివరాలతో అధికారులు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కార్యాలయాల్లో అధికారులు టార్గెట్ రీచ్ అవడమే లక్ష్యంగా పనిచేస్తుండటం విశేషం.