ముంబై, ఆగస్టు 13 : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న సూచీలు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. 450 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సెన్సెక్స్ మళ్లీ 78 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 113.61 పాయింట్లు లాభపడి 78,079.96 వద్ద నిలిచింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం నష్టాల్లోకి జారుకున్నది. 40.10 పాయింట్లు కోల్పోయి 24,395.85 వద్ద నిలిచింది.
షేర్లలో ఇంటర్గ్లోబల్ ఏవియేషన్, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్యూఎల్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, మధ్యతూర్పు ప్రాంతంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం వల్లనే సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా రియల్టీ సూచీ అత్యధికంగా 1.46 శాతం, ఎఫ్ఎంసీజీ, సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, ఫోకస్డ్ ఐటీ, ఐటీ, యుటిలిటీ రంగ షేర్లు లాభాల్లో ముగియగా..మెటల్, కమోడిటీస్, ఇన్సూరెన్స్, టాప్-10 బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లు నష్టపోయాయి.
టాటా గ్రూపునకు చెందిన పలు కంపెనీల షేర్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించడంతో బుధవారం భారీగా నష్టపోయిన గ్రూపు షేర్లు గురువారం తిరిగి లాభపడ్డాయి. అత్యధికంగా టాటా టెక్నాలజీ షేరు 3.26 శాతం లాభపడగా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 2.74 శాతం, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ 1.68 శాతం, టాటా ఎలిక్సస్ 1.36 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 1.28 శాతం, ట్రెంట్ 1.08 శాతం, టీసీఎస్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, వోల్టాస్ షేర్లు లాభపడగా..టైటాన్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.