వ్యక్తిగత విషయాలను ఎక్కువశాతం చాలామంది గోప్యంగానే ఉంచుతారు. బహిర్గతం చేసుకోరు. కానీ అందుకు భిన్నమైన వ్యక్తిత్వం నటి అనుపమ పరమేశ్వరన్ది. తన అనుభవాలు ఇతరులకు హెచ్చరికలా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా మనసును ఆవిష్కరించారామె. ‘ప్రేమ పేరుతో ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చాడు. పరిచయమైన మూడు నెలలకే నిశ్చితార్థం, వివాహం అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టాడు. ఆ తొందరపాటులో ప్రేమకంటే నన్ను నియంత్రించాలనే ఆత్రమే ఎక్కువ కనిపించేది.
నేను ధరించే దుస్తులు, సోషల్ మీడియాలో నేను పెట్టే పోస్టులు, చివరికి నేను ఎంచుకునే సినిమాల విషయంలో కూడా ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు. అసలు నటనకే నన్ను దూరం చేయాలని చూశాడు. దాంతో స్వేచ్ఛకు దూరమై మానసికంగా నలిగిపోయాను. కేరవాన్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. ఒక్కోసారి అతని ప్రవర్తన భయం కలిగించేది. ఈ ఆందోళన వల్ల బరువు తగ్గిపోయాను.
నా కెరీర్లోనే అతి పెద్ద విజయమైన ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్కి నేను హాజరు కాకపోవడానికి కారణం కూడా అతనే. అందుకే ఆ విషపూరిత బంధాన్ని అతికష్టం మీద తెంచుకున్నా. ప్రస్తుతం ఆ మానసిక గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అనుపమ. అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆమె వెల్లడించలేదు. అగ్రహీరో విక్రమ్ తనయుడు ధృవ్తో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అనుపమ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.