తులం రూ.42,000?
రోజురోజుకూ పడిపోతున్న పసిడి ధరలు
మార్కెట్లో అంతంతమాత్రంగానే డిమాండ్
దిగొచ్చే కస్టమ్స్ సుంకంతో మరింత చౌక
ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన పసిడి విలువ.. ఇప్పుడు పతనమవుతున్నది. మున్ముందు మరింతగా తగ్గే వీలుందన్న ఊహాగానాలూ జోరుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో తులం రూ.42 వేలకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా పెండ్లిండ్ల సీజన్ కూడా కాకపోవడంతో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. దీంతో పుత్తడి ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. దిగొచ్చే కస్టమ్స్ సుంకంతో ధరలు మరింత తగ్గవచ్చన్నఅభిప్రాయాలున్నాయి. ఇక మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.380 తగ్గి రూ.45,110కి చేరుకున్నది. 22 క్యారెట్ల ధర రూ.41,350గా ఉన్నది.
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 30: బంగారం ధర తులం రూ.42వేలకు రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గి రూ.44,110 వద్దకు చేరుకున్నది. సోమవారం ఈ ధర రూ.44,250గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధరలూ దిగజారాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ.320 తగ్గి రూ.63,210కి దిగొచ్చింది.
హైదరాబాద్లో రూ.380 తగ్గుదల
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.380 తగ్గి రూ.45,110కి చేరు కున్నది. 22 క్యారెట్ల ధర రూ.41,350గా ఉన్నది. అలాగే కిలో వెండి రూ.800 చౌకై రూ.68,500కు చేరింది. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ల నష్టాల మధ్య గతేడాది రికార్డు స్థాయిలో బంగారం ధరలు దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఒక దశలో రూ.57వేలపైనే పలికింది. కానీ ప్రస్తుతం రూ.44 వేల స్థాయికి పడిపోయింది. రూ.13,000 దిగొచ్చింది. ఈ ఏడాది ఆరంభం నుంచే రూ.6వేలు తగ్గడం గమనార్హం.
ఫ్యూచర్ మార్కెట్లోనూ అదే తీరు..
ఫ్యూచర్ మార్కెట్లోనూ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ నెలకుగాను తులం ధర 1.8 శాతం తగ్గి ఏడాది కనిష్ఠ స్థాయిలో రూ.43,800గా ఉన్నది. అలాగే వెండి ధర 1.2 శాతం దిగి రూ.64,060 వద్దకు చేరుకున్నది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,698 డాలర్లకు, వెండి 24.49 డాలర్ల వద్ద నిలిచింది.
మరో వెయ్యి తగ్గొచ్చు
బంగారం, వెండి దిగుమతులపై తగ్గే కస్టమ్స్ సుంకంతో ధరలు మరింత దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ నిర్ణయాలు అమల్లోకి వస్తుండటంతో బంగారం ధరలు ఇంకా దిగుతాయన్న అంచనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర ఒకేసారి వెయ్యి దిగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: