Cricket Records | ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్కు ఒక సమున్నత స్థానం ఉంది. అద్వితీయమైన ఆటతీరుతో నమ్మశక్యం కాని రికార్డులను తన పేరు రాసుకున్నది. క్రికెటర్లపై అభిమానులు చూపించే ఎనలేని అభిమానం కారణంగా క్రికెట్ ఇప్పుడు మన దేశంలో ఓ మతంతో సమాన స్థాయిని అనుభవిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే ఆటగాళ్లు తమ అసమాన ఆటతో ఎన్నో రికార్డులను తమ పేర రాసుకుని ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను పదిలం చేసుకున్నారు. 1932 మొదలు ఇప్పటి వరకు దాదాపు 90 ఏండ్లుగా ఇండియా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నది. ఈ క్రమంలో ఎన్నో మధర క్షణాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇందులో 2011 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీ విన్నింగ్స్ సిక్స్, 1983 ఫైనల్లో విండీస్తో జరిగిన మ్యాచ్లో కపిల్దేవ్ అందుకున్న వివ్ రిచర్డ్స్ ఐకానిక్ క్యాచ్ వంటివి ఎప్పటికీ మధుర క్షణాలే. వీటితోపాటు కొన్ని నమ్మశక్యం కాని విషయాలు కూడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియుకులకు చిరపరితమైన పేరు కోహ్లీ. తన 15 ఏళ్ల క్రికెట్లో బ్యాట్తో ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుకెక్కాడు. అయితే, 2011లో జరిగిన ఓ ఘటన కోహ్లీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇంగ్లండ్లో పర్యటించిన భారత జట్టు మాంచెస్టర్లో జరిగిన ఏకైక టీ20లో ఆతిథ్య జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 165 పరుగులు చేసింది. అజింక్య రహానే 39 బంతుల్లో 61, సురేశ్ రైనా 19 బంతుల్లో 33 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కెవిన్ పీటర్సన్ 22 బంతుల్లో 33 పరుగులు చేసి ప్రమాదకరంగా మారాడు. దీంతో కెప్టెన్ ధోనీ 8వ ఓవర్లో విరాట్ కోహ్లీని రంగంలోకి దింపాడు. కోహ్లీ సంధించిన మొదటి బంతిని ఆడేందుకు ముందుకొచ్చిన పీటర్సన్ కాస్తా బోల్తా పడ్డాడు. బంతి ధోనీ చేతిలోకి వెళ్లడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టంప్స్ గిరాటేశాడు. అయితే, ఆ బంతిని అంపైర్ వైడ్బాల్గా ప్రకటించడంతో జీరో బంతికే కోహ్లీ ఖాతాలో వికెట్ చేరింది. వన్డే, టీ20, ఐపీఎల్లో కోహ్లీ నాలుగేసి వికెట్లు చొప్పున పడగొట్టాడు.
మొదటి తరం క్రికెట్ అభిమానులకు చిరపరిచితమైన పేరు నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ. 1932-1946 మధ్య 14 ఏళ్ల కెరియర్లో ఆరు టెస్టులు ఆడిన పటౌటీ 10 ఇన్నింగ్స్లలో 199 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఆయన పేరుపై ఓ ఘనమైన రికార్డు కూడా ఉంది. ఇండియాతోపాటు ఇంగ్లండ్కు కూడా ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఇండియన్ ప్లేయర్గా చరిత్ర పుటల్లో పేరు సంపాదించుకున్నాడు. 1932-33లో యాషెస్ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పటౌడీ ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే దుమ్మురేపాడు. కళ్లు చెదిరే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఆ టూర్లో రెండు టెస్టులు ఆడిన పటౌడీ మూడు ఇన్నింగ్స్లలో 122 పరుగులు చేశాడు. ఆ తర్వాత 1946లో మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించిన భారత జట్టుకు పటౌడీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే, ఇండియా కెప్టెన్గా మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మూడు టెస్టులు ఐదు ఇన్నింగ్స్లలో 55 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్ను ఇంగ్లండ్ 1-0లో ఎగరేసుకుపోయింది.
ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్కు క్రికెటర్గా పలు రికార్డులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత 20 వేలకు పైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్ ద్రవిడ్ మాత్రమే. ద్రవిడ్ గురించి చాలామందికి తెలియని విషయం ఇది. 2003లో జరిగిన ‘ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే లీగ్’లో ద్రవిడ్ స్కాట్లాండ్ తరపున 11 మ్యాచ్లు ఆడాడు. 66.66 సగటుతో 600 పరుగులు చేశాడు. సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో శతకం కూడా బాదాడు.
ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి ముందు పాకిస్థాన్ తరపున ఆడాడు. 1989లో నాలుగు టెస్టులు, నాలుగు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించింది. కరాచీలో జరిగిన తొలి టెస్టులో సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి ముందే సచిన్ పాకిస్థాన్ తరపున ఆడాడు. 1987లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.పాక్ ప్లేయర్లు జావెద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ లంచ్ బ్రేక్లో మైదానాన్ని వీడడంతో టెండూల్కర్ స్టాండ్బై ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు.
థర్డ్ అంపైర్ చేతిలో అవుటైన తొలి ఆటగాడిగా కూడా సచిన్ పేరు రికార్డుల్లో ఉంది.1992లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది.అప్పుడు క్రికెట్లో టీవీ అంపైర్ను పరిచయం చేశారు. డర్బన్లోని కింగ్స్మీడ్లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కపిల్దేవ్ 43 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో ప్రొటీస్ జట్టు 254 పరుగులకే కుప్పకూలింది. రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా పట్టుబిగించింది. అజయ్ జడేజా, సంజయ్ మంజ్రేకర్ను వెంటవెంటనే పెవిలియన్ పంపింది. టెండూల్కర్, రవిశాస్త్రి క్రీజులో ఉన్నారు. టెండూల్కర్ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. పాయింట్లో కాపుకాసిన జాంటీరోడ్స్ గబుక్కున బంతి అందుకుని వికెట్ల వద్దనున్న ఆండ్రూ హడ్సన్కు బంతి అందించడం, అతడు వికెట్లను గిరాటేయడం వెంటవెంటనే జరిగిపోయింది. అయితే, అది అవుటా? కాదా? అన్న అనుమానం మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలోనూ తలెత్తింది. దీంతో థర్డ్ అంపైర్ కర్ల్ లీబెన్బెర్గ్ను సంప్రదించారు. రీప్లేలో సచిన్ అవుటని తేలింది. అది అవుటేనని ప్రకటించడంతో టెండూల్కర్ మైదానం వీడాడు. అలా థర్డ్ అంపైర్ చేతిలో అవుటైన తొలి ఆటగాడిగా సచిన్ నిలిచిపోయాడు.
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు 1964లో ఇండియాలో పర్యటించింది. ఇటు పర్యాటక జట్టు కానీ, అటు ఆతిథ్య జట్టుగానీ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది.అయితే, బాపు నాదకర్ణిగా చిరపరిచితుడైన భారత బౌలర్ రమేశ్చంద్ర గంగారామ్ నాదకర్ణి అద్వితీయమైన బౌలింగ్ ప్రతిభతో రికార్డు సృష్టించాడు. చెన్నైలో జరిగిన ఆరంభ టెస్టులో ఇండియా 7 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసింది. బుది కుందేరన్ (192), విజయ్ మంజ్రేకర్ (108) సెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్కు నాదకర్ణి చుక్కలు చూపించాడు. వరుసగా 131 డాట్ బంతులు డాట్ బాల్స్ వేసి ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇప్పటి వరకు ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు.ఈ మ్యాచ్ తర్వాత నాదకర్ణి పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోయింది.
అప్పట్లో లాలా అమర్నాథ్ను బెస్ట్ ఆల్రౌండర్గా పరిగణించేవారు.1933-52 మధ్య భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడుతూనే సెంచరీ సాధించి టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన ఇండియన్గా రికార్డులకెక్కాడు. స్వాతంత్య్రం తర్వాత భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. 1947 నవంబరులో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్లోని గబ్బాలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ డాన్ బ్రాడ్మన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్రాడ్మన్ 185 పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 382 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 226 పరుగుల తేడాతో ఓడినప్పటికీ కెప్టెన్ లాలా అమర్నాథ్ మాత్రం చరిత్ర సృష్టించాడు. హిట్వికెట్ ద్వారా బ్రాడ్మన్ను వెనక్కి పంపిన ఏకైక బౌలర్గా లాలా రికార్డులకెక్కాడు.
రెండు టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు 1999లో భారత్లో పర్యటించింది. చెరో టెస్టులో విజయం సాధించడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. చెన్నై టెస్టులో 12 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం)లో జరిగిన రెండో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది.అనిల్ కుంబ్లే, హర్భజన్సింగ్ చెలరేగిపోవడంతో వాసిం అక్రం సేన 172 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో పాక్ 420 పరుగులు ఛేదించాల్సి వచ్చింది. ఓపెనర్లు సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిది తొలి వికెట్కు 101 పరుగులు జోడించారు. అయితే, ఆ తర్వాత కుంబ్లే దెబ్బకు పాక్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగారు. 41 పరుగులు చేసిన అఫ్రిదిని వెనక్కి పంపిన కుంబ్లే అదే ఊపుతో మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాక్ 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 212 పరుగుల తేడాతో విజయం సాధించింది.పదికి పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్న కుంబ్లే ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు.
టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన మహమ్మద్ అజారుద్దీన్ పేరున బోల్డన్ని రికార్డులున్నాయి. అసలు అతడి తొలి అడుగే సంచలనం.1984లో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్తో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైన తర్వాత కోల్కతా టెస్టులో కపిల్దేవ్, సందీప్ పాటిల్ను పక్కనపెట్టి 21 ఏళ్ల అజార్కు జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్లో అజార్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (110) పరుగులు చేసి దేశం దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత చేపాక్లో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లోనూ అజార్ సెంచరీ బాదాడు. ఇక, చివరిదైన కాన్పూరు టెస్టులోనూ సెంచరీ (122) చేయడంతో అజార్ పేరు మార్మోగిపోయింది. ఈ సిరీస్లో ఇండియా ఓడినప్పటికీ సమర్థవంతమైన ఆటగాడు జట్టుకు దొరికాడు.
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ది ప్రత్యేక అధ్యాయం. 2013లో క్రికెట్కు గుడ్బై చెప్పేసిన సచిన్ పేరున ఇప్పటికీ బోల్డన్ని రికార్డులు పదిలంగా ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 34,357 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్తోపాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ సచిన్ అద్భుతంగా రాణించాడు. ముంబై తరపున 310 మ్యాచ్లు ఆడి 25,396 పరుగులు చేశాడు. 2009 వరకు రంజీల్లో ఒక్కసారి కూడా అతడు డకౌట్ కాలేదు. అయితే, 2008-09 రంజీ ట్రోఫీలో 18 ఏళ్ల భువనేశ్వర్కుమార్ చేతిలో తొలిసారి సచిన్ డకౌట్ అయ్యాడు. రంజీల్లో సచిన్కు అదే తొలి, చివరి డకౌట్.
SatwikSairaj | ఫార్ములా వన్ కార్ కంటే ఫాస్ట్గా స్మాష్.. గిన్నిస్ రికార్డుకెక్కిన సాత్విక్