అశ్వారావుపేట, ఆగస్టు 3 : కూలీల వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్, ఆజీవీకా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రాంజీ) (పూర్వ ఉపాధి హామీ పథకం) ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు పెండింగ్ వేతనాల చెల్లింపులోనూ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. నెలలతరబడి నిరీక్షించిన ఉద్యోగులు.. అసహనం, ఆగ్రహంతో ప్రధాన డిమాండ్ల సాధనకు కార్యాచరణ చేపట్టారు. ఈ నెల 15 నాటికి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు కూడా ప్రకటించారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 182 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలు చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరును వీబీజీ రాంజీగా మార్చిన విషయం విదితమే. అయితే, ఈ పథకం ప్రారంభం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన చాలామంది ఉద్యోగులు కీలకంగా పనిచేస్తున్నారు. ‘ఒకే పోస్టు – ఒకే వేతనం’తో కొనసాగుతున్నారు.
దాదాపు 20 ఏళ్లు గడిచినా వారి వేతనంలోనూ, వారి హోదాలోనూ మార్పులేదు. పైగా, సమస్యలు కూడా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. పే స్కేల్ అమలు, సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ వేతనాలు విడుదలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముందస్తు కార్యాచరణతో ఈ ఏడాది జూలై 27 నుంచి సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనలను దశల వారీగా ఉధృతం చేస్తున్నారు.
కూలీల వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించడంతోపాటు గ్రామ ప్రగతిలో వీబీజీ రాంజీ ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా హరితహారం, పల్లె ప్రగతి, చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ అనుబంధ పనులు, రోడ్ల నిర్మాణాలు, పండ్ల తోటల అభివృద్ధి, ఇంకుడు గుంతల నిర్మాణం, వైకుంఠాధామాలు, క్రీడా ప్రాంగణాలు వంటి అనేక ప్రభుత్వ అభివృద్ధి పనులను వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయినా ఉద్యోగ భద్రతలేక అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 182 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. ఈ నెల 15 నాటికి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క తదితరులు గతంలో పలుమార్లు హామీ ఇచ్చారు. అయినా అవి ఇంతవరకూ అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై ఉపాధి హామీ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే శాఖ పరిధిలో పనిచేస్తున్న సెర్ప్ (ఐకేపీ) ఉద్యోగులకు పే స్కేల్ అమలుచేస్తున్న ప్రభుత్వం.. తమకెందుకు అమలు చేయడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తమకు హామీ ఇచ్చారని, తమను కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఆ హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.