బూర్గంపహాడ్, సెప్టెంబర్ 18 : ప్రజా పాలనలో భాగంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సరోజ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాలల ఆవరణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు భోజన సమయంలో చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, సురక్షితమైన తాగునీటిని తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తొలుత గ్రామంలో పాఠశాలల విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా హీ సేవా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.