శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ( Sherilingampalli Circle ) సర్కిల్ పరిధిలో మరో భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడం కలకలం రేపింది. గోపన్నపల్లి ఎన్టీఆర్నగర్లోని తాజ్నగర్( Tajnagar ) లో సుమారు 45 గజాల స్థలంలో నిర్మించిన జీ ఫ్లస్ 4 అంతస్తుల భవనం ఒకవైపు ఒరిగినట్లు (Building Tilts ) గుర్తించారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న సర్కిల్ అధికారులు అక్కడికి చేరుకుని ఒరిగిన భవనంతో పాటు చుట్టుపక్కల ఇండ్లను ఖాళీ చేయించారు.
భవనంలో ఒక్కో అంతస్తులో రెండు గదుల చొప్పున మొత్తం తొమ్మిది గదులను నిర్మించారు. ఒక్కో గదిలో ముగ్గురి నుంచి ఐదుగురు వరకు నివసిస్తున్నట్లు సమాచారం. భవనం ఒరిగిన సమయంలో ప్రమాదం సంభవించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అంజయ్యనగర్లో నిర్మాణ దశలో ఉన్న భవనం కూలి ప్రాణనష్టం జరిగిన ఘటన మరువకముందే ఇదే సర్కిల్ పరిధిలో మరో భవనం ప్రమాదకర స్థితికి చేరడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చిన్న స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు, నిర్మాణ నిబంధనల అమలు, అనుమతుల పరిశీలనపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.