Andre Russell : పొట్టి క్రికెట్ విధ్వంసక ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్(Andre Russell) యూ టర్న్ తీసుకున్నాడు. గత కొంత కాలంగా జాతీయ జట్టు కంటే ప్రాంచైజీ(Franchise Cricket)లకు ఆడడానికే ప్రాధాన్యమిచ్చిన అతను మనసు మార్చుకున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్(Westindies) తరఫున టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)ఆడాలని అనుకుంటున్నాడు. అందుకోసం ఫ్రాంచైజీ క్రికెట్ను త్యాగం చేసేందుకు తాను సిద్ధమని రస్సెల్ తెలిపాడు.
‘నేను అందుబాటులో ఉన్నాను. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా. ఒకవేళ ఎంపికైతే ఎంతో సంతోషిస్తా. ఆలోపు రెండు మూడు సిరీస్లు ఆడాలని ఉంది. ప్రస్తుతం దేశం తరఫున వరల్డ్ కప్ ఆడడం తప్ప మరేదీ నా మనసులో లేదు. జట్టుకు నా వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రస్సెల్ వెల్లడించాడు.
ఆండ్రూ రస్సెల్
త్వరలోనే టీమిండియా(Team India)తో వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. దాంతో, ఆ సిరీస్తో మళ్లీ జట్టులోకి రావాలని అతను ఆశిస్తున్నాడు. కానీ, ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని రస్సెల్ చెప్పాడు. ప్రస్తుతం అతను మేజర్ క్రికెట్ లీగ్(Major Cricket League)లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్(Los Angeles Knight Riders) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
విండీస్ జెర్సీతో ఈ స్టార్ ఆల్రౌండర్ 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్తో రస్సెల్ విండీస్ బోర్డుకు రాం రాం చెప్పాడు. 2012, 2016లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్గా నిలిచిన విండీస్ జట్టులో ఈ ఆల్రౌండర్ సభ్యుడు కావడం విశేషం. విండీస్ క్రికెటర్గా కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తోనే రస్సెల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వరల్డ్ కప్ ఫైనల్లో(2016) గెలిచాక సహచరులతో డాన్స్ చేస్తున్న రస్సెల్
సొంత క్రికెట్బోర్డుతో విభేదాల కారణంగా రస్సెల్ జాతీయ జట్టుకు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు గాయాలతో సతమతమైన అతడిని విండీస్ బోర్డు పట్టించుకోలేదు. ఆ సమయంలో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఫ్రాంచైజీ అన్ని విధాలా అండగా నిలిచింది. అందుకని రస్సెల్ కోల్కతాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.
సంచలన ఆటకు కేరాఫ్ అయిన ఈ జమైకా క్రికెటర్ 2019 సీజన్లో ఆకాశమే హద్దుగా ఆడాడు. 14 ఇన్నింగ్స్ల్లో 510 రన్స్ కొట్టాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంతో, కోల్కతా యాజమాన్యం అతడిని అట్టిపెట్టుకుంటూ వస్తోంది.
2019 సీజన్లో చితక్కొట్టిన రస్సెల్
అయితే.. పదహారో సీజన్లో మాత్రం ఈ విండీస్ ప్లేయర్ చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు. 7 మ్యాచుల్లో కేవలం 99 పరుగులు చేశాడంతే. ఒక్క రింకూ సింగ్ తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో, కోల్కతా జట్టు ఈసారి ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.