Prithvi Shaw : భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఇంగ్లండ్ అనుసరిస్తున్న బాజ్ బాల్ (Bazzball) ఆటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాజ్బాల్ అనేదాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని ఈ విధ్వంసక బ్యాటర్ అన్నాడు. ‘బాజ్బాల్ అనే పదానికి వాళ్లు చెప్పే నిర్వచనం నాకు అర్థం కావట్లేదు. అయితే.. నా దృష్టిలో యాషెష్ మూడో టెస్టులో సెంచరీ బాదిన మిచెల్ మార్ష్(Mitchell Marsh) సరైన బాజ్బాల్ క్రికెటర్. ఇక నా విషయానికొస్తే.. బంతిని చూశానంటే గట్టిగా బాదుతాను. తమ ఆటతీరును ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. వాళ్లు ఏ పేర్లతో పిలిచినా చివరకు అది మా ఆట.. క్రికెట్’ అని షా తెలిపాడు.
ఎడ్జ్బాస్టన్ (Edgbaston)లో జరిగిన మూడో టెస్టులో మార్ష్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ పేస్ దళాన్ని అలవోకగా ఎదుర్కొన్న అతను బంతికి ఒక పరుగు చొప్పున పరుగులు సాధించాడు. 118 బంతుల్లో 118 రన్స్ కొట్టి ఆసీస్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. మార్ష్, షా ఇద్దరూ ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ఆడారు.
మిచెల్ మార్ష్, పృథ్వీ షా
ఒకప్పుడు టీమిండియా ఓపెనర్గా గట్టి పోటీనిచ్చిన పృథ్వీ షా.. ఐపీఎల్ 16వ సీజన్లో పేలవ ఫామ్తో విమర్శలపాలయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డేవిడ్ వార్నర్(David Warner) జోడీగా ఓపెనింగ్ చేసిన అతను మొదటి ఆరు ఇన్నింగ్స్లో కేవలం 40 రన్స్ చేశాడంతే. వరుస మ్యాచుల్లో చెత్త ప్రదర్శనతో బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే.. ఎట్టకేలకు ఆఖరి లీగ్ మ్యాచ్లో అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ సీజన్ అతడిని ఓ పీడకలలా వెంటాడడం ఖాయం.
పృథ్వీ షా
ఫిట్నెస్తో పాటు టెక్నిక్ సమస్యలు ఎదుర్కొంటున్న ఈ డాషింగ్ ఓపెనర్ను విండీస్ పర్యటనకు పక్కనపెట్టేశారు. ఈమధ్యే ముగిసిన దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లోనూ పృథ్వీ షా మరోసారి నిరాశపరిచాడు. వరుసగా 26, 25, 65, 7 పరుగులు చేశాడంతే. దాంతో, అతను మళ్లీ భారత జట్టుకు ఎంపికవ్వాలంటే మరింత కష్టపడాల్సిందే. దేశవాళీలో పరుగులు సాధిస్తేనే సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకునే అవకాశం ఉంది.