సిద్దిపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో రూ.3.50 కోట్ల నిధులు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ప్రధాన ఆలయంతో పాటు కల్యాణ మండపం, రాజమండపం, ధ్వజస్తంభం, స్వామి వారి మూలవిరాట్, అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. ప్రత్యేక పూజలు చేసేందుకు యాగశాలను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్కు ఈ ఆలయమంటే ఎంతో సెంటిమెంట్. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తున్నది. 1985లో మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989,1994,1999, 2001, 2004, 2009,2014, 2018 ఇలా వరుసగా జరిగిన ఎన్నికల్లో వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేసి అఖండ విజయం సాధించారు.
భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి పొందిన నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్టాపన మహాత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం కేసీఆర్కు అత్యంత ఇష్టదైవమైన వేంకటేశ్వర స్వామి ఆలయం కోనాయిపల్లిలో రూ.3.50 కోట్లతో నూతనంగా నిర్మించారు. ఈ ఆలయంలో పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మహోత్సవాలకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు హాజరవుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, గ్రామస్తులు వెంకన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయడంతో, సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ ద్వారా రూ. 3.50 కోట్లను మంజూరు చేయించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రధాన ఆలయంతో పాటు కల్యాణ మండపం, రాజమండపం, ధ్వజస్తంభం, స్వామి వారి మూలవిరాట్, అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. ఉత్సవాల్లో భాగంగా యాగశాలను సిద్ధం చేశారు.
1985 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
1985 నుంచి సీఎం కేసీఆర్కు ఏ పనిని ప్రారంభించినా కోనాయిపల్లి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇలా చేసిన ప్రతిసారి విజయం వరించడంతో ఆయన మరింత ధీమాగా ముందుకు వెళ్తున్నారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి సిద్దిపేటకు ఎన్నికయ్యారు. 1989,1994,1999, 2001, 2004, 2009, ఎన్నికల నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేసి గెలుపొందారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే ఏకైక లక్ష్యమని భావించి ఆనాడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్ 27న రాజీనామా చేసి, అదే రోజు ఉదయం కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. పార్టీ జెండాతో పాటు తెలంగాణ సాహిత్యం, పాటల క్యాసెట్లను దేవుడి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్లోని జలదృశ్యంలో పార్టీని ఏర్పాటు చేసి 14 ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు.
2004లో తెలంగాణలో పోటీ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల బీ ఫారాలకు పూజలు చేయించి వారికి అందజేశారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్కు, సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్, హరీశ్రావు సిద్దిపేట, కేటీఆర్ సిరిసిల్లకు ముగ్గురి నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో సైతం ఘన విజయం పొందారు. అలాగే, 2014 సాధారణ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఇక్కడ పూజలు చేసి గజ్వేల్, మెదక్ పార్లమెంట్ స్థానాలకు పోటీచేసి గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 ఎన్నికల్లో సైతం ఇక్కడ పూజలు నిర్వహించి నామినేషన్ వేయగా, రెండో సారి కూడా భారీ మెజార్టీతో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
2004 ఉప ఎన్నికల నుంచి మంత్రి హరీశ్రావుకి అచ్చొచ్చింది…
కోనాయిపల్లి వేంకటేశ్వరాలయం సెంటిమెంట్ గుడిగా ప్రాచు ర్యం పొందింది. ఈ దేవాలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. సిద్దిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు సైతం ఈ ఆలయం చాలా సెంటిమెంట్. 2004 ఉపఎన్నికల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న హరీశ్రావు తొలిసారిగా కోనాయిపల్లి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి, సంతకాలు చేసి పోటీ చేయడంతో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ ఆలయం హరీశ్రావుకు కూడా సెంటిమెంట్గా మారింది. మంత్రి హరీశ్ 2004, 2008, 2009 ,2010, 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు సైతం ఇక్కడ పూజలు చేయించి నామినేషన్లు వేయించారు.
సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయం…
కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం అంటే సీఎం కేసీఆర్కు ఎంతో సెంటిమెంట్. ఏ శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్ పత్రాలను వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1985లో
మొదటి సారి కేసీఆర్ సిద్దిపేటకు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలో ఇక్కడ పూజలు చేసి నామినేషన్ వేస్తే అఖండ విజయం ఖాయమనే విశ్వాసంతో ఉండేవారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన రోజు పార్టీ జెండా,
పాటల క్యాసెట్లను వెంకన్నస్వామి వద్ద పెట్టి పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. వెంకన్నస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడున్నర
ఏండ్ల నుంచి రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారు. ఈ దేవాలయం మంత్రి హరీశ్రావుకు సైతం అచొచ్చింది. 2006 నుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమాల వివరాలు
11న (శుక్రవారం)
సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, విష్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, అంకురార్పణ, అంకురార్పణ హోమం, అఖండ దీపారాధన, యాగశాల పర్యగ్నీకరణ శాత్తుముఱై, తీర్థ ప్రసాద వితరణ
12న (శనివారం)
ఉదయం 7 గంటల నుంచి సేవాకా లం, అరణి ఆరాధన, శాంతి పాఠం, ద్వార తోరణ, ధ్వజ మండల కుంభ ఆరాధన, హోమారంభం, మూలమూర్తులకు గవ్యంతారాధనం, నిత్య పుర్ణాహుతి, శాత్తుముఱై, తీర్థ ప్రసాదాలు.
సాయంత్రం 5 గంటల నుంచి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సాయమారాధన, క్షీర చింతన జలాదివాసం, అదివాస హోమం, నివేదన, శాత్తుముఱై, తీర్థ ప్రసాద వితరణ.
13న(ఆదివారం)
ఉదయం 7 గంటల నుంచి సేవాకాలం, శాంతి పాఠం, చతుఃస్థానార్చన, నిత్యహవనం, మూర్తులకు సప్తదశ కలశస్నపనం, శాత్తుముఱై, తీర్థప్రసాద వితరణ. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, సామయారాధన, చతుఃస్థానార్చన, ధాన్యాదివాసం, అదివాస హోమం, అష్టబలి, వాస్తుహోమం, వాస్తుబలి, పర్యగ్నీకరణం, తీర్థప్రసాద వితరణ
14న (సోమవారం)
ఉదయం 7 గంటల నుంచి సేవాకాలం, శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూల మంత్రహోమాలు, వేద పారాయణాలు, మూర్తులకు షోడశ కలశస్నపనం, నిత్యపుర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ. ఉదయం 9 గంటల నుంచి యంత్ర ప్రతిష్ట శ్రీశ్రీశ్రీ దుర్గప్రసాద్ స్వామీజీ వారి పర్యవేక్షణలో జరుగుతాయి.
సాయంత్రం 5 గంటల నుంచి శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వార తోరణ ధ్వజకుంభారాధన, చుతుఃస్థానార్చన, మూలమంత్ర హోమాలు, శయ్యాదివాసం, ఫలపుష్పాదివాసం, అదివాసహోమం, శాత్తుముఱై, తీర్థప్రసాద వితరణ.
15న (మంగళవారం)
ఉదయం 7 గంటల నుంచి సేవాకాలం, శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూల మంత్ర హోమాలు, శాత్తుముఱై, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం 5 గంటల నుంచి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, చతుఃస్థానార్చన, యాగశాల స్థాపిత దేవతాముల మంత్ర హోమాలు, కళాన్యాసహోమాలు, శాత్తుముఱై, తీర్థప్రసాద వితరణ.
16న (బుధవారం)
ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, శాంతిపాఠం, శాంతిహోమం, ప్రాణ ప్రతిష్టహోమం, మహా పుర్ణాహుతి, దృష్టికుంభం, నేత్రోన్మీళనం, కుంభాభిషేకం, మంగళవస్తు ప్రదర్శన, ప్రథమారాధన, నివేదన, శాత్తుముఱై, శాంతి కల్యాణం, ఆచార్య, ఋత్విక్ సన్మానం, భగవత్ బంధువులందరికీ ఆశీర్వచనం కార్యక్రమాలు జరుగుతాయి.