హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇచ్చి, పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఎన్జీవోలు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 7న నాగార్జునసాగర్లో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు శనివారం టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టాలతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగుల విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకొన్నామని రాజేందర్ పేర్కొన్నారు. ఈ కృతజ్ఞత సభలు నాగార్జునసాగర్ నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతి జిల్లా నుంచి టీఎన్జీవో ఉద్యోగులు, రాష్ట్ర బాధ్యులు దాదాపు వెయ్యి మంది ఈ సభకు వస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’