అటు ఢిల్లీలో.. ఇటు గల్లీలో లేదు
70 ఏండ్లలో ప్రజలను పట్టించుకోలేదు
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
గుర్రంపోడు, ఏప్రిల్ 3: కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా అవుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అటు ఢిల్లీలో లేదని.. ఇటు గల్లీలోనూ కన్పించకుండా పోయిందని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం వట్టికోడులో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు దశాబ్దాల పాటు రాష్ర్టాన్ని పరిపాలించినా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కనీసం గ్రామాలకు సాగు, తాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టినట్టు చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. కేసీఆర్ ప్రభుత్వం యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లకు చేప పిల్లల పంపిణీ చేయడంతోపాటు గీత కార్మికులకు తాళ్ల పన్ను లేకుండా చేస్తే ప్రతిపక్షాలకు గిట్టడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి విద్యావంతుడైన టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ను గెలిపించాలని కోరారు.
తలాపున నీళ్లున్నా పారలే: జగదీశ్రెడ్డి
తలాపున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కాంగ్రెస్ హయాంలో భూములు తడవలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం, చామలేడు, పిట్టలగూడెం, చామలోనిబావి, వట్టికోడు, పోచంపల్లి, ముల్కలపల్లి, తేనెపల్లి, తేనెపల్లి తండా, గాసీరాంతండా, ఎల్లమోనిగూడెం, జూనూతుల, మక్కపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్), సుల్తాన్పురం, శాఖాజీపురం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ తరఫున మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి : ఎమ్మెల్సీ పల్లా
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. 2014కు ముందు గ్రామాల్లో ఉదయం కరెంట్ పోతే రాత్రి వచ్చేది.. ఇప్పుడు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు దొరికేవారు కాదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తున్నారని తెలిపారు. నోముల నర్సింహయ్య తనయుడు భగత్ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
ఎన్నారైల ప్రచారం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): నాగార్జుసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకులు శివ కట్టబోయిన తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పెద్దవూర మండలంలో ప్రచారం చేశారు. తన గెలుపు కోసం ప్రచారం చేస్తున్న ఎన్నారై నాయకులకు నోముల భగత్ ధన్యవాదాలు తెలిపారు.
జానారెడ్డికి ఓటమి తథ్యం: మహబూద్ అలీ
హాలియా: ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటమి తప్పదని హోంమంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు. శనివారం అనుముల మండలం మదారిగూడెం, పెద్దవూర మండ లం కొత్తలూరు గ్రామాల్లో ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ముస్లింలకు షాదీముబారక్, మైనార్టీ గురుకులాలు, ఇతర దేశాల్లో ఉన్నతమైన చదువుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కల్పిస్తున్నదన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ను గెలిపించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’