న్యూఢిల్లీ: మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆఖరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం అలవాటు. అయితే ఇకమీదట అలా చేస్తామంటే కుదరదు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఏడాపెడా బాంబులు కాలిస్తే భారీగా జరిమానాలు కట్టాల్సిందే. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. నగరంలో శబ్ధకాలుష్యం సృష్టించే వారికి విధించే జరిమానాలను ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం శబ్ధకాలుష్యానికి కారణమైనవారు రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
నివాస సముదాయాలు, వ్యాపార ప్రాంతాల్లో నిర్ణీత సమయం దాటిన తర్వాత పటాకులు కాల్చే వారి రూ.1000, అదే సైలెంట్ జోన్లలో బాంబులు కాల్చితే రూ.3000 జరిమానా చెల్లించాలని తెలిపింది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన వేడుకల్లో పటాకులు పేల్చినట్లయితే నిర్వాహకులు రూ.10 వేలు, రూ.20 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక రెండో సారి నిబంధనలు అతిక్రమిస్తే రూ.40 వేలు, రెండు కంటే ఎక్కువసార్లు రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది.