అమరావతి : కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి (Dastagiri) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. గురువారం ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో జైభీమ్రావు ( Jaibeemrao ) పార్టీ తరుఫున నామినేషన్ వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న స్థానం నుంచే దస్తగిరి పోటీ చేయడం రాజకీయ ప్రాదాన్యం సంతరించుకున్నది.
ఐదేండ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరుగగా కేసులో నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్గా మారడం, కోర్టుల ఆదేశాల మేరకు బెయిల్పై విడుదల, భారీ భద్రతల మధ్య దస్తగిరి బయట తిరుగుతున్నాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్రెడ్డి వైసీపీ (YCP) అభ్యర్థిగా కడప ఎంపీ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీచేస్తున్నారు.