న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కేసులను త్రిపురలో గుర్తించారు. రాష్ట్రంలో 90 డెల్టా ప్లస్ కేసులను గుర్తించామని అధికారులు ప్రకటించారు. ఈ తరహా లక్షణాలు కనిపించిన 151 మంది నుంచి నమూనాలను సేకరించామని, పరీక్షల నిమిత్తం వాటిని పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ల్యాబ్కు పంపించామని తెలిపారు. వాటిలో 90 మందికి డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. మరికొన్ని నమూనాల్లో డెల్టా, ఆల్ఫా వేరియంట్ లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు కర్ఫ్యూ విధించింది. ఇది శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలు, రాజధాని అగర్తలా మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నది.