భారత సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనా
బీజింగ్, జూలై 9: చైనా కొత్త కుతంత్రానికి తెరలేపింది. టిబెట్లో నివసిస్తున్న యువకులను సైన్యంలోకి తీసుకొని శిక్షణనిస్తున్నది. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మోహరిస్తున్నది. ఈ ప్రక్రియ ఈ ఏడాది మొదట్లో నుంచి కొనసాగుతున్నట్టు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీలో ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఈ టిబెటన్ బృందాల్ని డ్రాగన్ వాడుకుంటున్నట్టు అంచనా వేశాయి. తర్ఫీదులో భాగంగా టిబెటన్ యువకులు తమ చట్టాలకు లోబడి ఉండేలా నిబంధనలపై చైనాప్రభుత్వం సంతకాలు కూడా చేయించుకుంటున్నట్టు సమాచారం. 1962 యుద్ధం సమయంలో ఎస్ఎఫ్ఎఫ్ పేరుతో టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు భారత సైన్యానికి సాయం అందించడం తెలిసిందే. ఇప్పుడు చైనా కూడా ఆ వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.