హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : నీట్ పరీక్ష తెల్లారే తెలంగాణ ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజే ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. అది కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్ష కావడం గమనార్హం. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెంటర్లకు చేరుకోవడం, ఒత్తిడికి గురవడం వంటి సమస్యలు తలెత్తుతన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీట్(యూజీ) ప్రవేశ పరీక్ష మే 3న జాతీయంగా జరుగనున్నది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే మే 4 నుంచి ఎప్సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు జరుగనున్నాయి. నీట్, ఎప్సెట్కు ఇంటర్ బైపీసీ విద్యార్థులే హాజరవుతారు. నీట్ సిలబస్కు, ఎప్సెట్ సిలబస్కు కొంత మాత్రమే వ్యత్యాసం ఉంటుంది.
దీంతో ఎప్సెట్ రాసే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవన్న వాదనలున్నాయి. అంతేకాకుండా సాయంత్రం 5గంటల వరకు పరీక్షరాసిన విద్యార్థుల్లో కొందరు ఉదయం 9గంటల్లోపే సెంటర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇది మరింత ఇబ్బందికరమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎప్సెట్ పరీక్షలకు గ్రేటర్లోనే ఎక్కువగా సెంటర్లున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలు, సుదూర ప్రాంతాల్లో నీట్ పరీక్షరాసిన వారు రాత్రికి రాత్రి వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి స్పందిస్తూ టీసీఎస్ వారిని సంప్రదించి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 90,279 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,09,868 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుములతో మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశమున్నది.