న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కార్యక్రమాలకు నాలుగు సార్లు ఆమె హాజరైనట్లు ఆరోపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, మరో 21 మందికి ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 27న క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ కేసు న్యాయ సమీక్షలో నిలబడలేదని, పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొంటూ ఆ సంస్థను తీవ్రంగా మందలించింది.
కాగా, ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. దీంతో ఆ తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉన్నదని న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులైన 23 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని ఆయన నిలదీశారు.
మరోవైపు ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న న్యాయవాదుల సంఘం ‘అధివక్త పరిషత్’ నిర్వహించిన కార్యక్రమాలకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ నాలుగు సార్లు హాజరయ్యారని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే తనకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ కోణంతో ముడిపడి ఉన్నదని కేజ్రీవాల్ విమర్శించారు. ‘నేను ఈ రోజు ఇక్కడ నిందితుడిగా నిలబడలేదు. నన్ను ఇప్పటికే నిర్దోషిగా విడుదల చేశారు’ అని అన్నారు. సీబీఐ విచారణను ట్రయల్ కోర్టు తప్పుపట్టినప్పటికీ దాని వాదనలను న్యాయమూర్తి స్వర్ణ కాంత శ్మర్మ చాలా వరకు సమర్థించారని కేజ్రీవాల్ ఆరోపించారు. మార్చి 9 నాటి ఉత్తర్వులతో తన గుండె జారిపోయిందని అన్నారు.
కాగా, కేసు విచారణలో పక్షపాతంపై తనకు తీవ్రమైన అనుమానాలు కలిగాయని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. తన విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ‘న్యాయమూర్తి స్వర్ణ కాంత శ్మర్మ సమక్షంలో జరిగే ఈ విచారణ నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండదనే తీవ్రమైన, నిజాయితీతో కూడిన సహేతుకమైన అనుమానం నాకు ఉన్నది. అందుకే లిక్కర్ పాలసీ కేసుపై సీబీఐ పిటిషన్ విచారణ నుంచి ఆమె వైదొలగాలి’ అని కేజ్రీవాల్ కోరారు.
మరోవైపు తన వాదనలు ముగించిన తర్వాత కోర్టు నుంచి వెళ్లేందుకు కేజ్రీవాల్ అనుమతి కోరారు. దీంతో న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఆయన వాదనలను మెచ్చుకున్నారు. ‘మీరు చాలా బాగా వాదించారు. మీరు న్యాయవాది కూడా కాగలరు’ అని అన్నారు. దీనికి కేజ్రీవాల్ చిరునవ్వుతో బదులిచ్చారు. ‘ధన్యవాదాలు మేడమ్. ప్రస్తుతం నేను చేస్తున్న పని పట్ల సంతోషంగా ఉన్నాను’ అని అన్నారు.
Also Read:
Gujarat Leader | మూడు పార్టీల తరపున నామినేషన్ దాఖలు.. చివరకు బీజేపీ వైపు మొగ్గు
Two grooms arrive for one bride | ఒకే వధువును పెళ్లాడేందుకు ఇద్దరు వరులు రాక.. తర్వాత ఏం జరిగిందంటే?
Students Kidnapped Classmate | విలాసవంత జీవితం కోసం.. క్లాస్మేట్ను కిడ్నాప్ చేసిన విద్యార్థులు