లక్నో: ఒకే వధువును పెళ్లి చేసుకునేందుకు ఇద్దరు వరులు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. పెళ్లి ఊరేగింపుగా వచ్చిన ఇద్దరు వరులను చూసి వధువు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అసలు విషయం తెలుసుకుని వారు షాక్ అయ్యారు. (Two grooms arrive for one bride) ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అమ్రోహాలోని బాంకెట్ హాల్లో పెళ్లి వేడుక కోసం వధువు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఆ వధువును పెళ్లాడేందుకు ఇద్దరు వరులు పెళ్లి ఊరేగింపుగా అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పెళ్లికూతురు కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చింది.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఒకే వధువును పెళ్లాడేందుకు ఇద్దరు పెళ్లికుమారులు రావడంపై ఆరా తీశారు. ఆ వధువుకు తొలుత మొరాదాబాద్కు చెందిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇటీవల ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో మొరాదాబాద్ వ్యక్తితో నిశ్చితార్థాన్ని వధువు కుటుంబం రద్దు చేసుకున్నది. ఆ వెంటనే సంభాల్కు చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నది. పెళ్లి ఖర్చుల నేపథ్యంలో ముందుగా ఖరారు చేసిన తేదీనే పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.
మరోవైపు నిశ్చితార్థం రద్దుకు ముందే మొరాదాబాద్ వరుడి కుటుంబం కూడా పెళ్లి పత్రికలను ముద్రించి పంపిణీ చేసింది. దీంతో పెళ్లి ఏర్పాట్లలో ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మొరాదాబాద్ పెళ్లికొడుకు కూడా తన కుటుంబంతో కలిసి ఆదివారం పెళ్లి ఊరేగింపుగా అమ్రోహాలోని పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు వరుల్లో ఎవరితో పెళ్లి జరిపించాలి అన్న నిర్ణయాన్ని వధువు కుటుంబానికే వదిలివేశారు. అయితే సంభాల్ వరుడితోనే వివాహం జరుపుతామని వధువు కుటుంబం తేల్చిచెప్పింది. దీంతో చేసేదేమీ లేక మొరాదాబాద్ పెళ్లికొడుకు తన కుటుంబంతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూడు వర్గాలు పరస్పర అవగాహనకు వచ్చాయని, దీంతో ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Students Kidnapped Classmate | విలాసవంత జీవితం కోసం.. క్లాస్మేట్ను కిడ్నాప్ చేసిన విద్యార్థులు
Watch: క్లినిక్ షట్టర్లో ఇరుక్కుపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?