బెంగళూరు: విలాసవంతమైన జీవితం గడిపేందుకు కొందరు విద్యార్థులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తోటి విద్యార్థులను కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక క్లాస్మెట్ కిడ్నాప్తో వీరి గుట్టు రట్టయ్యింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. (Students Kidnapped Classmate) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. బీహార్, జార్ఖండ్, కేరళ, బెంగళూరుకు చెందిన నలుగురు విద్యార్థులు జల్సాలకు అలవాటుపడ్డారు. విలాసవంతమైన జీవితం కోసం వారు ఒక ముఠాగా ఏర్పడ్డారు. పలువురు విద్యార్థులను కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
కాగా, ఆ నలుగురు స్టూడెంట్స్ కలిసి తాజాగా ఒడిశా విద్యార్థి మొహంతిని టార్గెట్ చేశారు. హాస్టల్ నుంచి అతడ్ని బయటకు రప్పించారు. బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఒక స్టూడెంట్ రూమ్కు మొహంతిని తీసుకెళ్లారు. అతడి స్నేహితులకు ఫోన్ చేశారు. విడుదల కోసం రూ.50,000 డిమాండ్ చేశారు.
మరోవైపు ఆందోళన చెందిన మొహంతి స్నేహితులు తొలుత రూ.10,000 ట్రాన్స్ఫర్ చేశారు. అయితే వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా నిందితుల ఆచూకీని గుర్తించారు. కిడ్నాపైన మొహంతిని రక్షించారు.
నిందితులైన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి వినియోగించిన నకిలీ మెటల్ గన్, కత్తి, కారును స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు పాత నేరస్తులని, ఒక ముఠాగా పనిచేస్తున్నారని పోలీస్ అధికారి తెలిపారు. జల్సాలకు డబ్బుల కోసం పలువురు విద్యార్థులను వారు బెదిరించినట్లు దర్యాప్తులో తెలిసిందని వెల్లడించారు.
Also Read:
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం.. ఢిల్లీకి 30 మంది ఎమ్మెల్యేలు