భోపాల్: ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేయించింది. భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా దోపిడీ దొంగలు కాల్పులు జరిపి చంపినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. (Wife Kills Husband With Lover) మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 8న 27 ఏళ్ల నిలేష్ జాతవ్, 23 ఏళ్ల భార్య రూబీ, తన బిడ్డతో కలిసి బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్నా గ్రామం నుంచి ఖారికాకు బైక్పై తిరిగి వెళ్తుండగా తన బ్యాగ్ రోడ్డుపై పడిపోయిందని రూబీ పోలీసులకు తెలిపింది. భర్త నిలేష్ బైక్ను ఆపగా రోడ్డుపై పడిన బ్యాగ్ తెచ్చేందుకు తాను వెళ్లినట్లు చెప్పింది. దోపిడీకి ప్రయత్నించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను కాల్చి చంపి పారిపోయారని పోలీసులకు వెల్లడించింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు భార్య రూబీ వాంగ్మూలంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమె గురించి ఆరా తీశారు. బంధువైన 21 ఏళ్ల ప్రియుడు విశాల్ విమల్తో ఆమెకు ఏడేళ్లుగా సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు వారిద్దరూ కలిసి ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇందులో భాగంగా రూబీ కావాలనే తన బ్యాగ్ను రోడ్డుపై పడేసింది. భర్త నిలేష్ బైక్ ఆపడంతో అక్కడ మాటువేసిన ప్రియుడు విశాల్, అతడి స్నేహితుడు రాజేష్ కుష్వాహ్ కలిసి కాల్పులు జరిపి అతడ్ని హత్య చేసినట్లు నిర్ధారించారు.
ఈ మేరకు ఆధారాలు సేకరించిన పోలీసులు రూబీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరాన్ని అంగీకరించడంతో ఆమెతో పాటు ప్రియుడు విశాల్ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నాటు తుపాకీ, ఖాళీ తూటాలు, రిజిస్ట్రేషన్ నంబరు లేని బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రాజేష్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: క్లినిక్ షట్టర్లో ఇరుక్కుపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?