Sai Srinivas | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుటుంబంలో వివాహ వేడుక సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. కావ్యారెడ్డి అనే యువతితో ఆయన వివాహం జరగనుంది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్న బెల్లంకొండ కుటుంబం, ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమంలో నిమగ్నమైంది.ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలసి, తమ కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్తో పాటు బెల్లంకొండ సురేష్ దంపతులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీఎం చంద్రబాబు, సాయి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త జీవితానికి ఆశీర్వదించారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ని కూడా కలిసి ఆహ్వానించినట్లు సమాచారం.
వివాహ వేడుక ఏప్రిల్ 29న పవిత్ర క్షేత్రం తిరుమలలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరగనుంది. అనంతరం మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రిసెప్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రముఖ రిసార్ట్లో సాయి శ్రీనివాస్ – కావ్యల నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరై ఆనందంగా జరుపుకున్నారు. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.
సినీ కెరీర్ విషయానికి వస్తే, సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు మాస్ యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ఇక వధువు కావ్యారెడ్డి విషయానికి వస్తే, ఆమె హైదరాబాద్కు చెందినవారని తెలుస్తోంది. ఆమె కుటుంబం విద్యావంతుల కుటుంబంగా పేరు పొందింది. ఆమె తాత జడ్జిగా పనిచేసినట్లు, తండ్రి లాయర్గా ఉన్నట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏమిటంటే, కావ్య చెల్లెలు, సాయి శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదువుకున్న సందర్భంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది తర్వాత ప్రేమగా మారిందని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమ్మతితో ఇప్పుడు ఈ జంట వివాహ బంధంలో అడుగుపెడుతోంది.