లక్నో : ఓ దళిత యువకుడి పట్ల కొందరు క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించారు. అతను దళితుడని తెలిసిన తర్వాత ప్రైవేటు భాగాలపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అక్బర్పూర్ ఏరియాలో ఓ యువకుడు నిలిచి ఉండగా.. అతన్ని కొందరు ఏం కులమని ప్రశ్నించారు. తన కులాన్ని చెప్పేందుకు నిరాకరించడంతో.. అతనిపై చేయి చేసుకున్నారు.
దెబ్బలకు తాళలేక తాను దళితుడిని అని చెప్పడంతో ఆ క్రూర మృగాలు మరింత రెచ్చిపోయారు. వెంట్రుకలను లాగుతూ.. కింద పడేసి హింసించారు. అంతటితో ఆగకుండా కర్రతో ప్రైవేటు భాగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు పోలీసుల దాకా చేరడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దళిత యువకుడిపై దాడి చేసిన ముగ్గురిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత యువకుడు కాన్పూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.