అలుపెరుగని పోరాట ఫలితంగా ఉద్యమ నాయకుడే రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టినప్పుడు ఎంతమందిలో ఎన్నెన్ని సందేహాలు? ఈ బక్కపలుచని నాయకుడు రాష్ర్టాన్ని సుతరాయించగలడా అని? పైగా ఎన్ని అవహేళనలు? ఎన్ని అవమానాలు! వాటన్నింటినీ తోసిరాజని పాలనాపగ్గాలు చేపట్టిన కేసీఆర్ దృఢచిత్తం, దృఢసంకల్పం, రాజకీయ పరిణతి అనిర్వచనీయం. అనేక అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, సహాయ నిరాకరణల మధ్యే పాలన కొనసాగించారు కేసీఆర్.
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పరిపాలన సాగించి వెక్కిరించే నోళ్లే ‘వహ్వా’ అనేట్టు చేసుకున్న కేసీఆర్ పాలన ఇవ్వాళ తోటి రాష్ర్టాలకు ఒక అభివృద్ధి నమునాగా నిలిచింది. ఉద్యమ నినాదమైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’లో మొట్టమొదటిది సాకారం చేసుకోవడానికి కేసీఆర్ కమిట్మెంట్ మాత్రమే కాదు ‘విజన్’ గూర్చి కూడా మేధావులు చర్చించుకోవడం విశేషం.‘నభూతో న భవిష్యతి’గా చెప్పుకొనే ‘రివర్స్ పంపింగ్ ద్వారా నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు తెలంగాణ తల్లి మెడలో పచ్చల మణిహారం వేసింది.
స్వతహాగానే మేధావి అయిన కేసీఆర్ ఉద్యమ సమయంలో తాను చేసిన పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన, పరిష్కారాల కోసం ఒక రోడ్మ్యాప్ ఏర్పర్చుకున్న రాజనీతిజ్ఞుడు. అంతేకాదు, ప్రజల సమస్యల పట్ల మావనీయ కోణంలో ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం గలవాడు. సున్నిత హృదయుడు. నిజం చెప్పాలంటే అతనో చెమ్మగిల్లే కన్ను. అట్ల అని మెతక స్వభావం అనుకుంటే పొరపాటే. అవసరమైన చోట, ఎంతవరకైనా తెగించి తన ప్రజల కోసం పోరాడే గట్టివాడుగా, దృఢచిత్తుడిగా, మొండివాడుగా పేరున్న నాయకుడు. తాననుకున్నది సాధించేవరకు నిద్రపోని క్రమశిక్షణ కలిగిన సైనికుడు.
ఈ తొమ్మిదేండ్ల (పదవ సంవత్సరం మొదలైన సమయంలో) పాలనలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ప్రగతిని చూసి ఎవ్వరైనా అబ్బుర పడాల్సిందే. రాష్ట్రంలో అమలురుస్తున్న అనేక పథకాలు కేసీఆర్ ‘మానస పుత్రికలు’గా చెప్తారు.
అతని ఆలోచనల్లోంచి పురుడు పోసుకున్నవే ఈ పథకాలన్నీ. ముఖ్యంగా గ్రామాలను పరిపుష్ఠం చేయడం కోసం ఏర్పడిన పథకాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు , రైతు బీమా, రైతు వేదికల నిర్మాణం, సబ్సిడీపై ఎరువులు మొదలైనవి రైతుకు మళ్లీ వ్యవసాయం ఉత్సాహంగా చేయడానికి ప్రేరణగా నిలిచాయి.
ఇకపోతే మిషన్ కాకతీయ, పల్లెల పునరుజ్జీవనానికి బాటలువేసి, నిండు గంగాళాల్లాంటి చెరువులలో పంటలను, పచ్చదనాన్ని, జీవావరణాన్ని ఇచ్చింది. వరిని పండించటంలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపి ‘అన్నపూర్ణ’గా మార్చింది. ఒకప్పుడు అన్నమో రామచంద్రా అని అర్రులు చాచిన పల్లెలు నేడు ఎక్కడ చూసినా బియ్యపు రాశులతో అలరారుతున్నాయి. రాష్ర్టాన్ని ‘అన్నపూర్ణ’గా తీర్చిదిద్దిన ఘనత మన ఉద్యమ నాయకుడిదే కదా!
గ్రామాలను బలోపేతం చెయ్యడానికి కేసీఆర్ తీసుకున్న మరో కీలక నిర్ణయం కులవృత్తులకు మళ్లీ జీవం పోయడం. పల్లెల్లో కులవృత్తులు మళ్లీ వేళ్లూనుకునేలా నగదు ప్రోత్సాహాన్నందించడం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. ఇకపోతే ‘దళితబంధు’ ద్వారా నిరుపేద, అట్టడుగు వర్గాలకు చెందిన దళితుల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం నింపి సామాజిక ఉత్పాదకతలో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను తన పాలనలో ప్రతిబింబింపజేయడం ఓ అరుదైన రాజకీయ నాయకుడి లక్షణం. అంతేకాదు గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని దర్శింపజేస్తున్న రాజనీతిజ్ఞుడు. ఒకప్పుడు ప్రజలు జీవనోపాధికోసం పొట్టచేత పట్టుకొని గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ, ఇప్పుడు పట్టణాల నుంచి తమ గ్రామాలకు ‘వాపస్ వలసలు’ వస్తున్నారు. గ్రామాలను స్వర్గసీమలుగా మార్చిన పాలకుడి ముందుచూపు కాదా!
అందుకే అంటారు ‘ A Leader is one who knows the way, goes the way, and shows the way ’ అట్లాంటి నాయకుడు కేసీఆర్. ఇది కదా పాలన అంటే, ఇది కదా అభివృద్ధి పథాన సాగడమంటే, ఇది కదా పునర్నిర్మాణం అంటే!
అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకొని ఆదరించే దిశగా సాగుతున్న కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడ్తున్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా ప్రశంసిస్తున్నారు. పదేండ్ల పసికూన తెలంగాణ అనేక అభివృద్ధి పథకాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచి రాజకీయ విమర్శకులను సైతం అబ్బుర పరుస్తున్నది. షాదీముబారక్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు, ఇక నెలనెలా ‘ఠంచను’గా వచ్చే ‘ఆసరా’ పింఛన్తో ఎంతోమంది అభాగ్యు ల జీవితాలు నిశ్చింతగా సాగిపోతున్నాయి. పింఛన్తో తమ బతుకులకు ‘ఆసరా’గా నిలిచిన కేసీఆర్కు గుండెల్లో గుడికట్టారు ప్రజలు.
కేసీఆర్ ఒక నిరంతర అధ్యయనశీలి, విద్యా సంపన్నుడు, నిగ ర్వి, అందరినీ కలుపుకొనిపోయే సరళ స్వభావి, తన అధ్యయన అనుభవాల్లోంచి జాలువారిన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి అనేక ప్రజాప్రయోగ పథకాలను రూపొందించిన, రూపొందించగల మేధావి. ఇట్లాంటి నాయకులే చరిత్రలో తమకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటారు. తమ పాలనావిధానంతో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖింపజేసుకుంటారు.
(వ్యాసకర్త: కవి, రచయిత్రి, విమర్శకురాలు)
– డాక్టర్ వాణీ దేవులపల్లి 98669 62414