2024, జూన్ 2 తెలంగాణకు ఒక మైలురాయి. అరవై ఏండ్ల విద్రోహ రాజకీయాలను ఓడించిన రోజు. తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు గడిచాయి. హైదరాబాద్ నగరం పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో ఒక క్లాజును ఇరికించారు. ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రం రద్దు కాకపోదా లేదా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకపోదా అన్న దు(దూ)రాలోచనతోనే విభజన చట్టంలో ఈ క్లాజును చేర్చినారని ఆనాడే ఉద్యమకారులు విశ్లేషించారు.
జూన్ 2న ఈ క్లాజుకు కాలం చెల్లుతుంది. హైదరాబాద్ నగరం పూర్తిగా, చట్టబద్ధంగా తెలంగాణ రాష్ట్ర రాజధానిగానే ఉంటుంది. హైదరాబాద్ నగర పాలనపై గవర్నర్కు ఉన్న ప్రత్యేకాధికారాలు కూడా రద్దయిపోతాయి. ఈ శుభ సందర్భంలో విద్రోహ రాజకీయాల చరిత్రను, ఉద్యమ చరిత్రను సమీక్షించుకోవడం ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
విద్రోహ రాజకీయాలు విజయం పొందిన రోజు 1956, నవంబర్ 1: మద్రాస్ నుంచి విడిపోయి కర్నూల్ రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకావడం, ఫజల్ అలీ కమిషన్ సిఫారసులకు విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను విలీనం చేసి 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకావడం అందరికీ తెలిసిన చరిత్రే. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అక్టోబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మారింది.
తెలంగాణ ప్రజలు మాత్రం అప్పటిదాకా విద్రోహ దినంగా పాటిస్తున్న నవంబరు 1ని పూర్తిగా మరచిపోయారు. ఈ పదేండ్లలో ఎన్నడూ నవంబర్ 1ని తలుచుకున్నది లేదు. ఆ రోజు అన్నిసాధారణ రోజుల్లాగే గడచిపోయింది. ఉద్యమ కాలంలో నవంబర్ 1ని విద్రోహ దినంగా జరపడంపై ఆంధ్ర ప్రాంత మేధావులు అభ్యంతరాలు వ్యక్తంచేసేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్రోహం వల్ల ఏర్పడింది కాదని, హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ తీర్మానం మేరకే విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందని వారు వాదించేవారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ముమ్మాటికీ విద్రోహ రాజకీయాల ఫలితంగా ఏర్పడిందన్నది తొలినాళ్ల నుంచే తెలంగాణ ప్రజల మనోగతం. అదే వాస్తవం కూడా.
ఫజల్ అలీ కమీషన్ ముందు విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ నాయకులు, ప్రజాసంఘాలు తమ అనుమానాలను, భయాందోళనలను వివరిస్తూ వందలాది వినతి పత్రాలను సమర్పించారు. కమీషన్ చాలా నిజాయితీగా వాటన్నింటిని రికార్డు చేయడమే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలు విడివిడిగా కొనసాగాలని విస్పష్టమైన సిఫారసులను చేసింది. హైదరాబాద్ రాష్ర్టానికి సంబంధించి కమీషన్ రెండు సిఫారసులను చేసింది.
మొదటిది- హైదరాబాద్ రాష్ర్టాన్ని విభజించి మరాఠి మాట్లాడే మరాఠ్వాడా జిల్లాలను మహారాష్ట్రలో (అప్పటికింకా బొంబాయి రాష్ట్రమే), కన్నడ మాట్లాడే జిల్లాలను కర్ణాటక రాష్ట్రంలో కలపాలి. రెండోది- మిగిలిన తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలను విడిగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగించాలి.
ఇట్లా అంటూనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనమే అనివార్యమైతే 1961లోనో, ఆ తర్వాతనో జరిగే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే హైదరాబాద్ శాసనసభలో (ఇక్కడ కమీషన్ Residuary Hyderabad State అన్న పదాన్ని వాడిందన్న సంగతిని గమనించాలి.) మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుంటే విలీనం చెయ్యాలని, లేకుంటే ఆంధ్ర, తెలంగాణ విడివిడిగా కొనసాగాలని కమిషన్ సిఫారసు చేసింది.
ఫజల్ అలీ కమిషన్ చేసిన ఈ సిఫారసు విజ్ఞతతో చేసినదని చెప్పాలి. ఎందుకంటే, పాత హైదరాబాద్ శాసనసభలో మరాట్వాడా, కర్ణాటక శాసనసభ్యులు హైదరాబాద్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండేవారు. పాత హైదరాబాద్ శాసనసభ ప్రకటించే అభిప్రాయం తెలంగాణ ప్రజల అభిప్రాయం కాజాలదు. కాబట్టి 1961లో తెలంగాణ జిల్లాలతో మాత్రమే ఏర్పడే శాసనసభ తీర్మానం ద్వారానే విలీనం జరగాలన్నది వారి అభిమతం.
అది మాత్రమే తెలంగాణ ప్రజల మనోభావాలను వెల్లడిస్తుందని వారి అభిప్రాయంగా కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు విలీనానికి అనుకూలంగా ఉండి ఉంటే అది 1961లోనూ వెల్లడయ్యేది. మరి ఆంధ్రులు 1961 దాకా ఆగకుండా 1956లోనే విలీనాన్ని ఎందుకు సంభవింపజేశారు? తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర నాయకులకు అవిశ్వాసం ఎంతటిదో తెలుసుకునేందుకు ఫజల్ అలీ నివేదికపై వారి వ్యాఖానాలే నిదర్శనం. నాటి ఆంధ్రపత్రిక ఈ వ్యాఖ్యానాలను రికార్డు చేసింది. ఆంధ్ర నాయకులు విలీనానికి ఎందుకు ఆతృతపడ్డారో ఆంధ్ర అసెంబ్లీలో వారి ప్రసంగాల్లో స్పష్టంగా వ్యక్తమైంది.
‘విలీనం వాయిదా పడితే ఇక విశాలాంధ్ర ఎన్నటికీ రాదు. ఆరేళ్లు ఆగడం చాలా ప్రమాదకరం. 1961 నాటికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఇంకా బలపడుతుంది. విశాలాంధ్రకు అప్పుడు ఒప్పుకోరు. 2/3 మెజారిటీ విశాలాంధ్రకు వచ్చుట కష్టం.’
– అయ్యదేవర కాళేశ్వరరావు‘విశాలాంధ్ర ఇప్పుడు తప్పితే ఇక రాదు.
– నీలం సంజీవరెడ్డి
‘విశాలాంధ్ర ఈనాడు ఏర్పడకపోతే అసంభవం కావచ్చునేమో’
– వావిలాల గోపాలకృష్ణయ్య
1961 దాకా ఆగితే అప్పటికే బలంగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరింత బలపడుతుందన్న ఆలోచనతో వారు ఢిల్లీకి పరుగులు తీసి కేంద్ర నాయకత్వంతో తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేసి విశాలాంధ్రను వ్యతిరేకించిన ప్రధాని నెహ్రూను లొంగదీసుకోగలిగారు. తెలంగాణ రాష్ట్రవాదిగా ఉండిన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును ఏ ప్రలోభాలకు గురిచేశారో గాని విశాలాంధ్ర వాదిగా మార్చివేశారు.
ప్రత్యేక రాష్ట్రవాదులుగా ఉన్న కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితరులను తెలంగాణకు రక్షణలు కల్పిస్తామని హామీ ఇచ్చి లొంగదీసుకున్నారు. వీరిచే పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేయించారు. మరాట్వాడా, కన్నడ ప్రాంత శాసనసభ్యుల మద్దతుతో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవడంతో (నిజానికి ఇటువంటి తీర్మానం ఏదీ జరుగలేదని, కేవలం శాసనసభలో చర్చ మాత్రమే జరిగిందని ప్రొ.జయశంకర్ గారు ఈ వ్యాస రచయితతో చెప్పారు. నిజనిజాలు తేల్చడానికి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చల రికార్డులను మాయం చేశారు.) అంతిమంగా వారు నెరిపిన విద్రోహ రాజకీయాలు సఫలమయ్యాయి.
ఈ విద్రోహ రాజకీయాలకు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న గోసాయి స్వామీ రామానంద తీర్థ ప్రోత్సాహాన్నిచ్చారని ఆనాటి ఉద్యమకారులు అభిప్రాయపడేవారు. ఆయన కన్నడ ప్రాంతవాసి. హైదరాబాద్ రాష్ట్రం విభజన అయితేనే మరాట్వాడా, కన్నడ జిల్లాలు తమ తమ మాతృ భాషా ప్రాంతాలతో విలీనానికి అవకాశం ఏర్పడుతుందని భావించి హైదరాబాద్ రాష్ట్ర విభజనకు మద్దతునిస్తూనే విశాలాంధ్ర ఏర్పాటుకు కూడా ప్రోత్సాహం అందించాడు. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో హైదరాబాద్ రాష్ట్ర విభజనకు, విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించడంలో ఈ గోసాయిదే కీలక పాత్ర అని తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, ఫజల్ అలీ సిఫారసులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం విద్రోహం కాక మరేమవుతుంది?
(ఇంకా ఉంది)
శ్రీధరరావు దేశ్పాండే