సకుటుంబ కథాచిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న 43వ సినిమా ‘వేదవ్యాస్’. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నారు. కొరియన్ నటి జూన్హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. సోమవారం ఎస్వీకృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో వేడుకలను నిర్వహించారు.
ఇందులో భాగంగా ‘వేదవ్యాస్’ సినిమా మేకింగ్ వీడియోను లాంచ్ చేశారు. వీటితోపాటు 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీకృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని కె.అచ్చిరెడ్డి గుర్తు చేసుకున్నారు. నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషం వెలిబుచ్చారు.