తెలంగాణ అప్పుల గురించి కాంగ్రెస్ నాయకులు తెగ ఊదరగొట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్నే ప్రధానంగా ఎత్తుకున్నారు. దానికితోడు కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారని అబద్ధాలను వల్లించారు. అసత్య ప్రచారాలతోనే అందలమెక్కారు. కానీ, ఇప్పుడు వారన్నట్టుగా ఖజానా బోసిపోవడం లేదు. అంచనాలకు మించి ఆదాయం వస్తూనే ఉన్నది. వరుసగా మూడో ఏటా పన్ను వసూళ్లలో వృద్ధి కనిపించింది. కాంగ్రెస్ సర్కార్ కొలువైన తర్వాత రూ.48 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.
ఈ మధ్య కరెంట్ పోతుంటే కేసీఆర్ గుర్తుకువస్తున్నారు. చందానగర్లో 24 గంటల పాటు కరెంట్ పోయినప్పుడు అందరికీ కేసీఆరే గుర్తుకువచ్చారు. పంటలు వర్షానికి తడిసిపోతుండటంతో, సమయానికి ధాన్యం కొనకపోవడంతో, బోనస్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఇప్పుడు కేసీఆరే గుర్తుకువస్తున్నారు. కాబట్టి కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదని చెప్పేవారు కళ్లున్న కబోదులే. కేసీఆర్ను మించినవారు లేరు.
ప్రభుత్వ ఖజానాకు, వ్యక్తుల ఖజానాకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర డబ్బులుంటే.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బీరువాలో దాచిపెడతారు. కానీ, ప్రభుత్వ ఖజానా అలా కాదు. ప్రభుత్వ ఖజానాలో నిరంతరంగా డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చవుతుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక లావాదేవీ జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు గుండుపిన్ను నుంచి మొదలుకొని కంప్యూటర్ పరికరాల వరకు ఎవరో ఒకరు, ఎక్కడో చోట ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటారు. తద్వారా నిరంతరంగా ఒక ప్రవాహం లాగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తూనే ఉంటుంది.
ఇలా వచ్చే ఆదాయాన్ని అప్పటి కేసీఆర్ సర్కార్ వాడుకోవాలనుకుంటే గనుక డిసెంబర్ 3 వరకు మాత్రమే వాడుకోగలదు. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ ఆ ఆదాయాన్ని వాడుకోలేరు కదా? డిసెంబర్ 3 తర్వాత వచ్చే ఆదాయమంతా నికరంగా ఈ ప్రభుత్వానికే చెందుతుంది. ఈ ఐదు నెలల కాలంలో రూ.48 వేల కోట్లు ఆదాయం సమకూరిందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది. కాబట్టి ‘ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారు’ అని చెప్పే మాటలకు విలువ లేదు. అది ప్రజలను మభ్యపెట్టడానికే. బహుశా అప్పటివరకు ఉన్న ప్రతి పైసాను ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు వివిధ పథకాల కోసం కేసీఆర్ వాడుకున్నారేమో. ఇది ప్రతి ఒక్కరూ చేసేదే. అంతేకానీ రాబోయే ఆదాయాన్ని కూడా కేసీఆర్ వాడుకోలేరు కదా?
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక రాష్ట్ర ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదు. అంతేకాకుండా రూ.59 వేల కోట్లు అప్పు చేయాలని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ పాలకులు పొందుపరిచారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేసీఆర్ను విమర్శించడం కోసమే ప్రజల నెత్తిపై ఇంత అప్పుల భారం ఉందని చెప్పారు తప్పితే చిత్తశుద్ధి లేదని దీని ద్వారా అర్థమవుతున్నది. అప్పుల భూతాన్ని చూపించి తెలంగాణ ప్రజలను బెదిరించారని తెలుస్తున్నది. ఎన్నో విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు అప్పులు చేయకూడదు కదా?
ఇప్పటికే కాంగ్రెస్ పాలకులు రూ.18 వేల కోట్ల వరకు అప్పు చేశారు. రుణమాఫీ చేసేందుకు మరో రూ.40 వేల కోట్లు అప్పు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దానికోసం వెతుకులాట కూడా మొదలైంది. అయితే ఈ హామీని ఎలా నెరవేర్చాలనే విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ఎన్నికల్లో గెలవడం కోసం వాగ్దానం చేసేశారు. తీరా అధికారంలో వచ్చాక దాన్ని ఎలా అమలుచేయాలో తెలియక ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. గుర్రం ముందు పచ్చగడ్డి వేసినట్టు.. రైతుల ముందు రుణమాఫీని ఎరగా వేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుల కోసం తిరుగుతున్నారు. అందులో భాగంగానే బడ్జెట్లో పేర్కొన్న రూ.59 వేల కోట్లకు అదనంగా మరో రూ.40 వేల కోట్లు అప్పు చేయాలని చూస్తున్నారు. బడ్జెటేతర అప్పు, అదనం కాబట్టే రుణమాఫీ కోసం కార్పొరేషన్ పెడతామంటున్నారు. ఈ లెక్కన ఏడాదిలో మొత్తం అప్పు రూ.లక్ష కోట్లవుతున్నది.
కేసీఆర్ సర్కార్ అప్పులు చేసిన మాట వాస్తవమే.
కానీ, దానిద్వారా తెలంగాణలో ఆస్తులను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువులు.. ఇవన్నీ ఆస్తులే కదా. తెలంగాణ కోసం ఆస్తులను నిర్మించేందుకు అప్పులను కేసీఆర్ వినియోగించారు. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం తక్షణమే అవసరమని భావించి మొదట్లో ఎక్కువ అప్పులు చేశారు.
‘తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారు. ఆయన హయాంలో తెలంగాణ తిరోగమించింది’ అనేది వాస్తవం కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ మాట అనేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. ఎంతసేపూ ‘అహంకారం, అప్రజాస్వామ్య పాలన, కేసీఆర్ ఎవరినీ కలవడం లేదు’ అనే ప్రచారమే సాగింది తప్పితే తెలంగాణ తిరోగమించిందని ఎవరూ అనలేదు. పదేండ్ల కిందటి తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు స్పష్టంగా తేడా ఉన్నది. ఆ తేడా మన కండ్లముందే కనిపిస్తున్నది. అందుకే కేసీఆర్కు హైదరాబాద్ ప్రజలు పట్టం కట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్దగా తేడా ఏమీ లేదు. అధికార కాంగ్రెస్కు, ప్రతిపక్ష బీఆర్ఎస్కు 1.8 శాతం ఓటింగే తేడా ఉన్నది.
ఈ మధ్య కరెంట్ పోతుంటే కేసీఆర్ గుర్తుకువస్తున్నారు. చందానగర్లో 24 గంటల పాటు కరెంట్ పోయినప్పుడు అందరికీ కేసీఆరే గుర్తుకువచ్చారు. పంటలు వర్షానికి తడిసిపోతుండటంతో, సమయానికి ధాన్యం కొనకపోవడంతో, బోనస్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఇప్పుడు కేసీఆరే గుర్తుకువస్తున్నారు. కాబట్టి కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదని చెప్పేవారు కళ్లున్న కబోదులే. కేసీఆర్ను మించినవారు లేరు. అక్కడక్కడా చిన్నచిన్న తప్పులు జరిగి ఉండవచ్చు. కేసీఆర్ను మించినవారు ఉంటే అటువైపు చూడవచ్చు. అంతేకానీ, సరైన ప్రత్యామ్నాయం లేకుండా కేసీఆర్ను వదులుకుంటే పెనం మీది నుంచి పొయ్యిలో పడిపోతాం అని నేను అప్పట్లోనే చెప్పాను. ప్రస్తుత కాంగ్రెస్ పాలన కేసీఆర్ పాలన కంటే బాగుందా? భిన్నంగా ఏమైనా ఉందా? అంటే అదేమీ లేదు కదా. అప్పటిలాగానే వీళ్లు అప్పులు చేస్తున్నారు. కాకపోతే పరిస్థితి దిగజారుతూ పోతున్నది కదా. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాం కదా?
తెలంగాణను కేసీఆర్ ఎంతగానో ప్రేమిస్తారు.
కేసీఆర్కు తెలంగాణతో ఎంతో అనుబంధం ఉన్నది. ఆయనకు వేరే యావ, ఆలోచన లేదు. గద్దెనెక్కాక చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, కాదనను. దేశమంతటా ఉన్నట్టే ఇక్కడా కొన్ని లోపాలు, అవినీతి ఉండొచ్చు. వాటిని ఖండించాల్సిందే. కేసీఆర్ చేసిన తప్పులను ఖండించే తీరుతో ఆయన చేసిన మంచినంతా విమర్శించడం సరికాదు కదా. కేసీఆర్ లోపాలను పక్కనపెట్టి కేసీఆర్ కంటే మెరుగైనవారు ఎవరున్నారు అనేది చూడాలి. అంతేకానీ అంతకంటే ఎక్కువ లోపాలున్నవారిని తెచ్చి గద్దె మీద కూర్చోబెడితే ప్రయోజనమేం ఉంటుంది?
రీస్ట్రక్చర్ అనే మాటను ఈ మధ్యకాలంలో ఐఎంఎఫ్ ఎక్కువగా వాడుతున్నది. ‘అప్పులను రీస్ట్రక్చర్ చేసుకోండి. దీర్ఘకాలంలో నెమ్మదిగా అప్పులను తీర్చండి’ అని ఐఎంఎఫ్ ఆయా దేశాలకు సూచించింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు చేయాల్సిన పని అది. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.
జైకా, ఏడీబీ లాంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పులు తెస్తామని, తద్వారా నెలకు రూ.900 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదు. నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే కేసీఆర్ సర్కార్ ఆయా బ్యాంకుల నుంచే అప్పులు తెచ్చేది కదా. గత ప్రభుత్వానికి కూడా తక్కువ వడ్డీకే అప్పులు వచ్చేవి కదా. మన దేశంలోని ఎస్బీఐ తదితర బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం వేరు, బయటి దేశాల బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చుకోవడం వేరు. అంతర్జాతీయ బ్యాంకులు కఠినమైన షరతులు విధిస్తాయి. బయటి నుంచి అప్పులు తెస్తున్నామంటే వారి షరతులకు తలొగ్గినట్టే.
సీఎం రేవంత్రెడ్డి చెప్తున్న బ్యాంకుల్లో ఒక్కటీ దేశీయ బ్యాంకు కాదు. విదేశీ అప్పులు ఎప్పటికీ భారమే. ఉదాహరణకు సంక్షేమ పథకాలను తగ్గించాలని ప్రపంచబ్యాంకు షరతులు విధిస్తుంది. యూజర్ చార్జీలు విధించాలనేది మరో షరతు. చంద్రబాబు హయాంలో అదే జరిగింది. ఇప్పుడు మోదీ సర్కార్ నగర కార్పొరేషన్లలో విధించే చెత్త పన్ను, ఆస్తి పన్ను ఆ కోవలోనివే.
ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవాలని, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు షరతులు విధిస్తుంది. ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి, పన్నులు పెంచాలి. అందుకోసం సబ్సిడీల్లో కోత విధించాలి. సంక్షేమ పథకాలను తగ్గించాలి. ప్రపంచమంతా ఇదే నడుస్తున్నది. ఏడీబీ అయినా, జైకా అయినా ఇవే షరతులను విధిస్తాయి. ఆదాయం పెరిగే మార్గం తెలియకుండా, ఖర్చు తగ్గించుకోకుండా ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు. అందుకే కేసీఆర్ హయాంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట కార్పొరేషన్లు పెట్టి దేశీయ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్ల ద్వారా సాగు, తాగునీటి సరఫరా చేసినందుకు గానూ సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని కేసీఆర్ సర్కార్ అప్పట్లో ఆదాయ మార్గాన్ని చూపించింది. ఒకవేళ కార్పొరేషన్లు అప్పులను చెల్లించకపోతే రాష్ట్ర సర్కార్ వాటిని తిరిగి కడుతుందని కేసీఆర్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. కానీ, వాస్తవానికి కాళేశ్వరం ద్వారా సరఫరా చేసిన సాగునీటికి గానీ, మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయిన తాగునీటికి గానీ కేసీఆర్ పైసా వసూలు చేయలేదు. పైగా 2014లో అధికారంలోకి రాగానే సాగునీటి తీరువాను రద్దు చేశారు.
తెలంగాణలో సాగునీటి కోసం రైతులు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. బ్యాంకులకు చెప్పినట్టు ప్రజల వద్ద నుంచి చార్జీలను వసూలు చేయలేదు. అప్పుల భారాన్ని ప్రజలపై మోపలేదు. బ్యాంకుల అప్పులనూ ఎగ్గొట్టలేదు. హామీ ఇచ్చినట్టుగానే కార్పొరేషన్ల పేరిట తీసుకున్న అప్పులను కేసీఆర్ సర్కారే కట్టింది. సాగు, తాగునీరు అందిస్తూ, అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ప్రభుత్వాన్ని ఎలా తప్పుపడతాం?
కేసీఆర్ సర్కార్ మార్గంలో ఈ ప్రభుత్వం నడవటం లేదు. అలా నడిచి ఉంటే ఇప్పటికే రైతుభరోసా అమలయ్యేది. డిసెంబర్ 9నే రుణమాఫీ పూర్తయ్యేది. జాబ్ క్యాలెండర్ విడుదలయ్యేది. ఆరు గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయో స్పష్టత లేదు. దీంతో రేవంత్రెడ్డి సర్కార్పై విమర్శలు పెరిగాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో రేవంత్రెడ్డి మేల్కొన్నారేమో. అందుకే రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తెల్లారే రుణమాఫీ ఎలా చేయాలనేదానిపై కార్యాచరణ రూపొందించేందుకు రంగంలోకి దిగారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుకూలత కనిపించడం, మరోవైపు రేవంత్రెడ్డి సర్కార్ పట్ల విమర్శలు వస్తుండటంతో ఆయన పౌరుషంతో సమీక్షలకు దిగారేమో. అయితే పౌరుషంతోనే ఆర్థిక సమస్యలు పరిష్కారం కావు.
తెలంగాణలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇన్పుట్ సబ్సిడీలు, కరెంటు కోతలు, పంట కొనుగోళ్లలో ఇబ్బందులతో మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. తెలంగాణ రాకముందున్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలే అందుకు నిదర్శనం.
కొత్త సర్కార్ కొలువైన నాటినుంచి తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. ఇది అందరికీ తెలిసిందే. నాడు కోకాపేట పరిధిలో ఎకరం భూమి రూ. 100 కోట్లు పలికితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ సర్కార్ లేని విలువని చూపెడుతున్నదని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల పేదలు, మధ్యతరగతివారు భూములు కొనలేరని విమర్శించారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి ఏం చెప్తున్నారు? ‘తెలంగాణలో భూముల విలువ పెరిగింది. ఆ మేరకు పన్నుల వసూళ్లు లేవు. మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ వ్యాల్యూకు పొంతన ఉండటం లేదు. ఈ రెండింటి మధ్య ఉన్న అగాథాన్ని పూడ్చాలంటే ఏడాదికి ఒకసారి భూముల విలువను సవరించాలి. కానీ, కేసీఆర్ సర్కార్ అలా చేయలేదు. కాబట్టి భూముల విలువను పెంచేందుకు అధ్యయనం చేయండి’ అని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశిస్తున్నారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపైనా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు.
భూముల విలువ పెంచడమంటే ప్రజలపై భారం మోపడమే. పెరిగిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరుగుతాయి. ఇప్పటికే తెలంగాణలో రియల్ ఎస్టేట్రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ, స్టాంప్ డ్యూటీలు పెంచడమనేది సరైనదేనా? ఎక్కువ ఆదాయం కోసం ఇలా చేస్తే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకొన్నట్టే. పైగా భూముల రిజిస్ట్రేషన్లు పడిపోతాయి. తద్వారా ఉన్న ఆదాయం కూడా తగ్గిపోతుంది.
ఆదాయం పెంచుకోవాలంటే ఎక్కువ లావాదేవీలు జరగాలి. గతంలో మహారాష్ట్ర సర్కార్ ఇదే విధానాన్ని అవలంబించింది. స్టాంప్ డ్యూటీలను సుమారుగా 2 శాతం వరకు తగ్గించింది. తద్వారా భూముల లావాదేవీలు పెరిగాయి. మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదే. ఒక ఉత్పత్తిని తక్కువ ధరకు అమ్మడం వల్ల నష్టాలు రావు. మార్జిన్ తక్కువ ఉన్నప్పటికీ అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి లాభాలు పెరుగుతాయి. ఉదాహరణకు 10 వస్తువుల మీద వచ్చే లాభాన్ని 4 వస్తువుల మీదనే సంపాదించాలని చూస్తే అసలుకే ఎసరు వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతున్నది. ధరలు పెంచడం వల్ల లావాదేవీలు తగ్గిపోతాయి. రియల్ ఎస్టేట్ పడిపోయిన నేపథ్యంలో స్టాంప్ డ్యూటీల్లాంటివి తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది.
కేసీఆర్ హయాంలో ప్రతి రెండు, మూడు రోజులకో పరిశ్రమ తెలంగాణకు వచ్చింది. అనేక పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. 500 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాల కల్పన.. అనే వార్తలు నిత్యం వినేవాళ్లం. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ కూడా తెలంగాణలో నెలకొల్పాల్సి ఉన్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు పరిశ్రమల స్థాపన అనే వార్తలు కనిపిస్తున్నాయా? అప్పుడెప్పుడో కాంగ్రెస్ సర్కార్ కొలువైన కొత్తలో దావోస్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ఒప్పందాలు చేసుకున్నట్టు గుర్తుంది. ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నియామక పత్రాలు అందజేశారే, ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే, కొత్త ప్రభుత్వం కొలువైన 15 రోజులకే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం సాధ్యపడదు. గత ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రక్రియలు పూర్తయినవే ఆ ఒప్పందాలు.
ఇప్పటివరకు రాష్ర్టానికి ఒక్క పరిశ్రమ వచ్చినట్టు దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాదు, పీపుల్ ఫ్రెండ్లీ కూడా కాదు. అందుకే పెట్టుబడులు రావడం లేదు. కానీ, కేసీఆర్ అలా కాదు. ఆయన ఇటు పీపుల్ ఫ్రెండ్లీ, అటు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ.
అందుకు హైదరాబాద్ పారిశ్రామికీకరణే నిదర్శనం. హైదరాబాద్ అభివృద్ధి జరిగింది కాబట్టే.. నగర ప్రజలు కేసీఆర్కు పట్టం కట్టారు. గ్రామీణ ప్రాంత రైతాంగం కూడా సంతృప్తితోనే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల అనుకూల ప్రభుత్వం. వైఎస్ఆర్ పాలనలో రైతాంగం సుభిక్షంగా ఉన్నారు. ఈ రెండింటి కలయికే కేసీఆర్ సర్కార్. కేసీఆర్ పాలనలో రైతాంగం అనుకూలత ఉంది, పారిశ్రామిక అనుకూలత కూడా ఉంది. బహుశా పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ శాతం బీఆర్ఎస్కు అనుకూలమే కావచ్చు.
తెలంగాణ పల్లెల గురించి పదేండ్ల కిందట మనం కథలు కథలుగా చెప్పుకొన్నాం. ఎవరైనా కాలం చేస్తే కాళ్లు కడిగేందుకు నీళ్లు దొరకని దయనీయ స్థితి. అరగంట కరెంట్ కోసం ఎమ్మెల్యేల కాళ్ల మీద పడాల్సిన దుస్థితి. అలాంటిరోజు నుంచి ఇప్పుడు ఎక్కడివరకు వచ్చామో ఒక్కసారి ఆలోచించాలి. గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాతి స్థానానికి చేరుకున్నాం. అయినప్పటికీ మేధావుల పేరిట చెలామణి అయ్యే కొంతమంది కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. న్యూట్రల్గా ఉండేవాళ్లు, వామపక్ష నాయకులు కూడా వ్యతిరేక ప్రచారమే చేశారు. కానీ, నేడు ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే వాళ్లలో ఒక్కరూ కనిపించడం లేదు. కేసీఆర్ దిగిపోయిన నాటి పరిస్థితే యథాతథంగా ఉండి ఉంటే ఫర్వాలేదు. కానీ, రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అందుకే విమర్శలు ఎక్కువవుతున్నాయి.‘కొత్త ప్రభుత్వం కదా, కొలువై ఐదు నెలలే అవుతున్నాయి’ అని కొంతమంది అనవచ్చు. అయితే హామీల అమలు కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడటంలో తప్పులేదు. కానీ, పరిస్థితులు దిగజారుతుంటే వేచి చూడటమనేది సరైన పద్ధతి కాదు.
‘కేసీఆర్ గుర్తులు చెరిపేస్తా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తా’ అనడం చిన్నపిల్లల మనస్తత్వమే. ఇదేనా పాలన అంటే? ‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పులు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ నాయకులు కుంటిసాకులు చెప్తున్నారు. కేసీఆర్ సర్కార్ కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే కదా అప్పులు చేసింది. కాకపోతే నాడు ప్రతిపక్షాలు పదేపదే ఈ విషయాన్ని లేవనెత్తాయి. దానికి బీఆర్ఎస్ సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేదు. ‘ఎన్నో చేశాం’ ప్రజలు ఓటు వేయకపోతారా? అని బీఆర్ఎస్ నేతలు అనుకొని ఉండవచ్చు. అందుకే అప్పుల అంశం ప్రజల మెదళ్లలోకి ఎక్కింది. ఆరు గ్యారంటీల అమలు కూడా సరిగ్గా లేదు. ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలైంది. మిగతా వాటిలో రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలు ప్రారంభమయ్యాయంతే. మహిళలకు రూ.2500 పథకం ఇంకా ప్రారంభమే కాలేదు. ‘షరతులు వర్తిస్తాయి’ అనే రీతిలో పథకాల అమలు జరుగుతున్నది. లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారు. రూ.48 వేల కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వమే చెప్తున్నది. అంచనాల కంటే రూ. 2 వేల కోట్లు అదనంగానే వచ్చిందంటున్నారు. మరి ఇదంతా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఆరు గ్యారంటీలు అమలు చేయవచ్చు కదా? నిర్వహణ లోపం కారణంగానే ఈ లోపాలు తలెత్తుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటో తారీఖున జీతాలు అన్నది కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పన్ను శాఖాధికారులతో సమీక్షలు నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి వారికి టార్గెట్ విధించి పన్నులు వసూలు చేయాలని చెప్పినట్టు తెలుస్తున్నది. లక్ష్యం పెట్టి పన్నులు వసూలు చేయడమనేది సాధ్యమయ్యే పనేనా. అదేమైనా రౌడీ మామూలా?
పోరాటం వేరు, నిర్మాణం వేరు. నిర్మాణానికి సమయం పడుతుంది. పోరాడేవాడు నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. ప్రతి పోరాటయోధుడు నిర్మాణదక్షుడు కాలేడు. కానీ, కేసీఆర్ అలా కాదు, ఆయనకు పోరాటం తెలుసు, నిర్మించడమూ తెలుసు. పోరాడటం, తిరగబడటం బ్రహ్మాండంగా తెలిసిన తెలంగాణకు.. నిలబడి నిర్మించటం కూడా నేర్పించారు కేసీఆర్. తెలంగాణకు మొదటినుంచి ప్రశ్నించడం, తిరగబడటం తెలుసు. అందుకే నిర్మాణంలోనూ ‘అది లేదు, ఇది లేదు’ అంటూ నిర్మితమవుతున్న తెలంగాణను కూలగొట్టుకున్నాం. అసలు ఉద్యమం ఉన్నదే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, కష్టనష్టాల పరిష్కారం కోసం.
తెలంగాణలో ఉద్యమాలు చేసిన చాలామంది అక్కడే ఆగిపోయారు. కానీ, కేసీఆర్ మాత్రం ఉద్యమంలో సఫలీకృతమవడమే కాకుండా తెలంగాణలోనూ మార్పు తీసుకొచ్చారు.
(వ్యాసకర్త: ఆర్థిక రంగ నిపుణులు)
డి.పాపారావు