Karnataka | హైదరాబాద్, మే 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ అస్థిరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం హిమాచల్ప్రదేశ్లో పతనం అంచు వరకూ చేరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ గండాన్ని గట్టెక్కింది. అయినప్పటికీ ఆ పార్టీలో ఇప్పటికీ లుకలుకలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పతనం అంచుకు చేరుకొన్నట్టు పెద్దయెత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు సొంతపార్టీలోని ప్రముఖ వ్యక్తులు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఈ వాదనకు మరింత బలాన్ని ఇస్తున్నది.
లోక్సభ ఎన్నికలు పూర్తవగానే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు. పార్టీలో ఇద్దరు ప్రధాన నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణమని వెల్లడించారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న పోటీ చివరకు ప్రభుత్వాన్ని కూల్చేలా చేస్తుందన్నారు. లోక్సభ ఫలితాలు వచ్చాక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండుగా నిట్టనిలువుగా చీలిపోతుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ప్రభుత్వం కూడా కూలిపోతుందని పేర్కొన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పరోక్షంగా ఈ తరహా వ్యాఖ్యలే చేయడం సంచలనంగా మారింది. తన నాయకత్వంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని డీకే ఇటీవల పేర్కొన్నారు. పరోక్షంగా తాను సీఎం కాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు జూన్ 4 తర్వాత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు జరుగొచ్చని స్థానిక మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా.. కర్ణాటక కాంగ్రెస్లో ‘నాథ్ ఆపరేషన్’ జరుగుతుందని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోవచ్చని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ చూస్తుంటే పతనం అంచుకు సర్కారు చేరుకొన్నట్టు అర్థమవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.