ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారుల గురించి విన్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కూడా సలహాదారులను నియమించుకోవడం కొత్త విషయమే. ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు తన ఐటీ సలహాదారునిగా సాయికృష్ణ అనే అతన్ని తాజాగా నియమించుకున్నారు. ఇదే బాటలో ఇతర మంత్రులు కూడా సలహాదారులను నియమించుకునే అవకాశం లేకపోలేదు. అయితే కొసమెరుపు ఏమంటే, సీఎం రేవంత్రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రభుత్వ సలహాదారుల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారని హైకోర్టులో కేసు వేసిన విషయం మరిచిపోయారా? అన్నది అసలు సంగతి.
లంచంలోనూ సెంటిమెంట్…
ఎవరి నమ్మకం వారిది. దీన్నే సెంటిమెంట్ అంటాం. అయితే లంచం తీసుకోవడంలోనూ సెంటిమెంట్ ఉంటుందని నిరూపించారు రెవిన్యూ ఉద్యోగి ఒకరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల డిప్యూటీ తహశీల్దార్ భరణిబాబు ఓ రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటూ తాజాగా ఏసీబీకి పట్టుబడ్డారు. లంచాలు తీసుకోవడం అనేది రెవిన్యూ శాఖలో సర్వ సాధారణ విషయమే. కానీ, ఆరేండ్ల కిందట 2018లో భరణిబాబు బూర్గంపాడులో పని చేస్తున్నప్పుడు ఓ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుని నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అప్పుడు… ఇప్పుడు సరిగ్గా రూ.20 వేలు మాత్రమే లంచం తీసుకోవడం ఏమిటనీ ఏసీబీ అధికారులు ప్రశ్నిసే, అది తన సెంటిమెంట్ అన్నారట పాపం.
డామిట్ కథ అడ్డం తిరిగింది
ఆర్ టాక్స్, బీ టాక్స్, యూ టాక్స్ అంటూ నిత్యం మీడియాలో నానుతున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ఇటీవల మీడియా మీద కస్సు బుస్సు అంటున్నారు. వారం రోజుల కిందట సచివాలయంలో సీఎంను కలువడానికి ఆయన అపాయింట్మెంట్ అడిగారు. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి ఆర్ టాక్స్ వసూలు ఆరోపణలు చేయడంతో తనకు అపాయింట్మెంట్ దొరకదని అంచనా వేశారు. పైగా ఆ రోజు క్యాబినెట్ ఉండటంతో అపాయింట్మెంట్ దొరకదని భావించారు. అందుకు నిరసనగా సచివాలయం ఎదుట కాసేపట్లో తాను ధర్నా చేయబోతున్నట్టు మీడియాకు సమాచారం ఇవ్వడంతో వారంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు. కానీ మీడియా మిత్రుడు ఒకరు ఈ విషయంపై సీఎంఓకు ఉప్పు అందించారు. దీంతో ఊహించని విధంగా అపాయింట్మెంట్ లభించడంతో మహేశ్వర్రెడ్డి కంగుతిన్నారు. తన ధర్నా గురించి లీక్ చేసిందెవరని మీడియాపై అప్పటినుంచి గుర్రుగా ఉన్నారు.
బొద్దింకల టేస్టే వేరు !
హైదరాబాద్లో హోటల్ టేస్ట్కు అలవాటు పడిన భోజన ప్రియులు తాము ఆర్డర్ చేసిన బిర్యానీ మూడు, నాలుగు రోజులుగా అసలు టేస్ట్ ఉండటం లేదని మండిపడుతున్నారట. దానికి మేమేమి చేస్తాం… టేస్ట్ లేకపోతే బుక్ చేసిన హోటల్స్కు ఫోన్ చేసి అడగండని డెలివరీ బాయ్స్ వాపోతున్నారట. అయినా మీకో విషయం అర్థం కావడం లేదు. హోటల్స్పై ఇటీవల శానిటరీ ఇన్స్పెక్టర్స్ రైడ్స్ చేయడంతో కిచెన్స్ నీట్గా ఉంచడం వల్ల బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, ఫంగస్ కలువకపోవడం వల్ల ముందటి టేస్ట్ రాకపోవచ్చని ఓ డెలివరీ బాయ్ అమాయకంగా చేసిన వ్యాఖ్య నెట్టింట వైరల్ అవుతోంది. నిజమే కదా!
– వెల్జాల