మెదక్ మున్సిపాలిటీ, మే 7: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కేసీఆర్ బస్సు యాత్ర రాందాస్ చౌరస్తాకు చేరుకోగానే బాణాసంచా కాలుస్తూ.. కేసీఆర్ వాహనంపై పూలవర్షం కురిపించారు. సాయంత్రం ఈదులుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసినా కేసీఆర్ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన ప్రజానీకంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఆశేష జనవాహిని తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. బస్సు యాత్ర వెంట బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చారు. గులాబీ జెండాలు, ఫ్లకార్డులు పట్టుకొని జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ వాహనం రాందాస్ చౌరస్తాకు చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న వేలాదిమంది ప్రజలు, అభిమానులు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. రోడ్డు షోలో పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.