Tirmula | వేసవి సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. ఏడు కొండలపై ఎటువైపు చూసినా భక్త జన సందోహం కనిపిస్తున్నది. అనూహ్యంగా పెరిగిపోయిన రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్ట్మెంట్లన్నీ, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లూ భక్తజనులతో నిండిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డులో మూడు కి.మీ మేరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తుల సర్వ దర్శనానికి 24 గంటలు పడుతున్నది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది తాగునీరు, అల్ఫాహారం అందజేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసి ముద్దయింది. స్వామి వారి దర్శనం తర్వాత లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లే భక్తులు ఇబ్బంది పడ్డారు. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తల దాచుకున్నారు. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడం వల్ల తిరుమల కొండల్లో చల్లని వాతావరణం ఏర్పడింది.