నారాయణఖేడ్, మే 16: అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్వింటాల్ వరికి రూ.500ల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం బోగస్ హామీ ఇచ్చామని ఒప్పుకున్నట్లేనని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతువ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం నారాయణఖేడ్లోని రాజీవ్చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
రైతులకు రైతుభరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పెట్టుబడి సాయం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని తెలిపారు.
ప్రతి పంటనూ కొనుగోలు చేసి రైతులను అండగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం చేయడమే కాకుండా తడిసిన వడ్లను కొనకుండా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వడ్లను సకాలంలో కొనుగోలు చేయని కారణంగానే పెద్దశంకరంపేట మండలం రామోజిపల్లిలో ఇటీవల తాత, మనవడు పిడుగుపాటుకు గురై మృతిచెందారని, దీనిని ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
సాగునీటి కల్పనపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయడంతో పాటు నల్లవాగు ప్రాజెక్టు, కాళేశ్వరం 19వ ప్యాకేజీ పనుల విషయం లో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఆందోళనలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీ, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పరమేశ్, సంజీవ్రావు, గంగారాం, నగేశ్, ఎంపీపీలు మహిపాల్రెడ్డి, జంగం శ్రీనివాస్, జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, విజయరామరాజు, నాయకులు నవాబ్, సత్యపాల్రెడ్డి, దిలిప్కుమార్, ఎంఏ. బాసిత్, పార్శెట్టి సంగప్ప, నారాయణరావు, సంగారెడ్డి, ఉబేద్, దుర్గయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.