Heat Stroke | కోహీర్ : ఎండలు మండిపోతున్నాయి.. ఇంకా మార్చి నెల మొదలే కాలేదు.. అప్పుడు భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే వచ్చేసరికి ఇండ్లలో నుంచి అడుగు కూడా బయటపెట్టలేమో అని బెంబేలెత్తిపోతున్నారు. వేడిగాలులతో ఉక్కబోత కూడా మొదలవ్వడంతో పండ్ల రసాలు, చెరుకురసం, కొబ్బరి నీళ్లు, మజ్జిక తదితర శీతల పానీయాలను తీసుకుని ప్రజలు తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అప్పుడు ఎలాంటి చికిత్స అందించాలి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..
వడదెబ్బ తగిలిన వారికి విపరీతమైన జ్వరం, నాడి వేగంగా కొట్టుకోవడం, తలనొప్పి, చికాకు, కండరాల నొప్పి, ముదురు రంగులో మూత్రం రావడం, చర్మం పొడిబారడం, స్పృహతప్పి పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
* సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా ఉండాలి.
* అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం తలపై టోపీ లేదా రుమాలు ధరించాలి.
* ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పుతో తయారుచేసిన పండ్ల రసాలు తాగాలి.
* నల్లటి దుస్తులకు దూరంగా ఉండాలి.
* ఇంటి గదుల్లో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు
* కిటికీలు, తలుపులకు తెరలను వినియోగించాలి.
* వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశానికి మార్చాలి. శరీరంపై ఉండే దుస్తులను తొలిగించి చల్లటి నీటిలో కడగాలి.
* ఐస్ ముక్కలను గుడ్డలో ఉంచి శరీరమంతా రుద్దితే ఉపశమనం కలుగుతుంది. శరీరానికి చల్లటి గాలి తగిలేలా చూడాలి.
* రోగగ్రస్తులకు చల్లటి నీరు, ఉప్పు కలిపిన నీటిని తాగించాలి.
వడదెబ్బ తగిలిన వారిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స చేయించాలి. మధ్యాహ్నం బయటకు రావడం తగ్గించుకోవాలి. తప్పనిసరి అయితే మాత్రం నెత్తిపై కచ్చితంగా టోపీ, రుమాలు ధరించాలి. వడ దెబ్బ తగిలిన వారిని వెంటనే దవాఖానకు తరలిస్తే వారి ప్రాణాలను కాపాడిన వారవుతారు.
– నవీన్కుమార్, కోహీర్ మండల వైద్యాధికారి
“Summer | ఎండాకాలంలో చిన్న పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?”