వినాయక్నగర్, జూలై 27: ఏడాది కాలంలో ఈగల్ ఫోర్స్ వివిధ రాష్ర్టాల సరిహద్దుల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి దాదాపు ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలతో కలిసి ఈగల్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లు, ఈగల్ ఫోర్స్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర రాష్ర్టాల పోలీసులను సమన్వయం చేసుకుంటూ పలు కీలక సంయుక్త ఆపరేషన్లు నిర్వహించినట్లు వివరించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ఫ్రాజోలమ్ మాత్రలు, గంజాయి ఇతర సంబంధిత సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ రూరల్, నిజామాబాద్ రూరల్, ముప్కాల్, నాల్గో టౌన్, ఆర్మూర్, నందిపేట్ పీఎస్ల పరిధిలతోపాటు వనపర్తి, కామారెడ్డి జిల్లా జుక్కల్ పీఎస్ పరిధిలో దాడులు నిర్వహించి రూ.52.06 లక్షలు విలువ చేసే 5,206 కిలోల ఆల్ఫ్రాజోలం సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఏడాది కాలంలో 165 మంది డ్రగ్స్/ గంజాయి వినియోగించే వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తరచూ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ జైలుకు వెళ్లి వచ్చినా తమ పద్ధతులు మార్చుకోకుండా మళ్లీ గంజాయి స్మగ్లింగ్, విక్రయానికి పాల్పడుతున్న పాత నేరుస్తులైన మున్నవర్ అలీ, షేక్ అలీమా, గంధం శ్రీనివాస్గౌడ్, మల్లెపూల లక్ష్మణ్గౌడ్పై పీడీ యాక్ట్ సైతం నమోదు చేశామని చెప్పారు. సమావేశంలో ఈగల్ ఫోర్స్ ఏసీపీ సోమనాథం, ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల గురించి తెలిస్తే యాంటీ డ్రగ్ టోల్ ఫ్రీ నెం. 1908, వాట్సాప్ నెం. 8712671111 లకు సమాచారం అందించాలని సూచించారు.