హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడంపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు బయట పటాకులు కాల్చి సంబురాలు చేసుకుంటుంటే.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల తూటాలతో విరుచుకుపడ్డారు. రెండేండ్లుగా రాష్ట్రంలో సాగిన అరాచక హైడ్రా విధ్వంసంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని మెజారిటీ ప్రజలు, యువత అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం.. అధికారం చేతిలో పెట్టుకొని చెలరేగిపోవడం వల్లే న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చిందని పేర్కొంటున్నారు. పేదల ఇండ్లు కూల్చి.. పెద్దలను మాత్రం వదిలేసిన తీరుపై విరుచుకుపడుతున్నారు. ఆయన వ్యవహారశైలిపై పలుమార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోనే న్యాయస్థానం ఈ చర్యలకు దిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
గతంలో రంగనాథ్ను అరెస్ట్ చేయాలని ఓసారి, మిలిటరీ యాక్షన్ కు దిగుతామని మరోసారి ఇలా సీరియస్ కామెంట్లు చేసిన కోర్టు తాజాగా ఏకంగా ఆయన బాధ్యతల నుంచి తొలగించాలని తీర్పు ఇవ్వడం పేదలందరికీ ఊరటనిచ్చే అంశమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఇలా స్పందించారు. ‘చేసిన పాపం ఊరికే పోదు.. పక్కాగా వెంటబడుతుంది.. ఇప్పుడు రంగనాథ్ టైమ్.. తర్వాత రేవంత్రెడ్డి వంతే’ అని ఎక్స్లో అశోక్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. ఇండ్లను కూల్చేసిన అన్ని ఏరియాల్లో ఓ రెండు గంటలు రంగనాథ్ను కూర్చోబెట్టి తీర్పు ఇస్తే బాగుండు.. ప్రజల స్పందన ఎలా ఉండేదో తెలిసేది’ అని మరో నెటిజన్ స్పందించారు.
‘న్యాయవ్యవస్థపై ప్రజలకు మరోసారి నమ్మకం పెరిగింది’ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనిని ఎదురుదెబ్బ అనేకంటే రేవంత్ ప్రభుత్వానికి అభిశంసన అని అనొచ్చు.. ఈ ప్రభుత్వానికి ఎన్ని సార్లు సుప్రీం కోర్టు, హైకోర్టు మొట్టికాయలేసిందో లెక్క చూస్తే రేవంత్రెడ్డి రాజీనామా చేసి తప్పుకోవాలి’ అని వివేకానంద రాజ ఎక్స్లో కామెంట్ చేశారు. ‘మంచే జరిగింది.. ఎన్ని ఘోరాలు చేశారు.. అధికారం అడ్డుపెట్టుకొని’ అని గంగాధర్ అనే నెటిజన్ స్పందించారు. ‘ఎంతమంది ఉసురు తగిలిందో.. ఎంతమందిని పుట్పాత్ మీదికి చేర్చాడో’.. అని నిహారికరెడ్డి అనే నెటిజన్ ఫేస్బుక్ లో కామెంట్ చేశారు.
‘పాములుపట్టేవాడు పాముకాటుకే పోయినట్టు అయ్యింది హైడ్రా వీ‘రంగం’ యవ్వారం’ అంటూ పావనిగౌడ్ స్పందించారు. ‘ముఖ్యమంత్రిని మెప్పించాలని ప్రయత్నించి.. ఉద్యోగినని మర్చిపోయి..చివరికి బలిపశువు అయ్యాడు’ అని పీవీఆర్ రావు కామెంట్ చేశారు. ‘ఎంతమందిని ఏడిపించిన్రు.. రాజ్యాంగ వ్యవస్థల ముందు తలదించక తప్పదు.. మల్లొక్కసారి చెప్పుర్రి ఇప్పుడు మేము హిట్లర్లం అని’ అంటూ రఘునందన్రెడ్డి సెటైర్ వేశారు. ‘పాపం పండే రోజు దగ్గరికొచ్చింది.. నరకాసుర వధ మొదలైంది’ అంటూ సుజాత అనే నెటిజన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
‘ఎంతటి అధికారంలో ఉన్నవారైనా, ఏ ప్రభుత్వ సంస్థ అయినా రాజ్యాంగం, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడి తీరాల్సిందే. ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైంది.
రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ, కోర్టు ధికరణలకు పాల్పడుతున్న అధికారులకు ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరిక. రూల్ బుక్ పకన పెట్టి పనిచేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.
చెరువుల పరిరక్షణ మంచిదే కానీ, దానిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడం, కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదు. కోర్టు తీర్పు ప్రభుత్వ ముసుగులను తొలగించింది.
తప్పు చేసే అధికారులకు ప్రభుత్వాలు అండగా ఉండవు. రేపు అధికారులు వ్యక్తిగతంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తీర్పు దానికి అద్దం పడుతున్నది.
ప్రభుత్వాలు ఎంత బలమైనవైనా, నిరంకుశంగా వ్యవహరిస్తే అడ్డుకట్ట వేయడానికి మన దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందనే ధైర్యం ఈ తీర్పు ద్వారా ప్రజలకు మరింత కలిగింది.
హైకోర్టు తీర్పుతో రేవంత్రెడ్డి ఆశల సౌధం హైడ్రా కూలిపోయింది. ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటే కోర్టులు మెట్టికాయలు వేస్తాయని పాలకులు గుర్తు పెట్టుకోవాలి.