కోల్కతా : పశ్చిమ బెంగాల్లో గురువారం ఆరో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర దీనాజ్పూర్, నాడియా, ఉత్తర 24 పరగణాలు, పూర్బా బర్ధమాన్ నాలుగు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10,897 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా… 1.03 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఓటింగ్ సాగనుంది. చివరి గంటలో కొవిడ్ రోగులు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఐదు విడుతల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 26న ఏడో విడుత, 29న ఎనిమిదో విడుత పోలింగ్ జరుగనుంది. వచ్చే నెల 2న ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఇదిలా ఉండగా.. ఆరో విడుతలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ 43 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కూటమి నుంచి సీపీఐ (ఎం) 23 మంది అభ్యర్థులను బరిలో దింపింది. ఈ విడుతలో టీఎంసీ నాయకుడు కృష్ణానగర్ దక్షిణ్ స్థానం నుంచి ఉజ్జల్ బిస్వాస్, పుర్బస్థలి దక్షిణ్ నుంచి స్వపన్ దేబ్నాథ్, దుమ్డం ఉత్తర్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి చంద్రమా భట్టాచార్య, సీపీఐ (ఎం) నుంచి తన్మోయ్ భట్టాచార్య పోటీలో ఉన్నారు.
అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, టీఎంసీ మాజీ నేత ముకుల్ రాయ్ కృష్ణానగర్ ఉత్తర్ స్థానం నుంచి, కాంగ్రెస్ సీనియర్ నేత మోహిత్ సేన్గుప్తా రాయ్గంజ్, బదురియా నుంచి మరో కాంగ్రెస్ నేత అబ్దుస్ సత్తార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏఐటీసీ మాజీ మంత్రి అబ్దుల్ కరీం చౌదరి ఇస్లాంపూర్ నుంచి, నాబాద్విప్ స్థానం నుంచి టీఎంసీ నేత పుండరీకాక్ష సాహా, ఇతహర్లో సీపీఐ నేత శ్రీకుమార్ ముఖర్జీ, హబ్రాలో టీఎంసీ అభ్యర్థి జ్యోతిప్రియ మల్లిక్, బీజేపీ నేత రాహుల్ సిన్హా బరిలో ఉన్నారు.