న్యూఢిల్లీ: గతేడాది కరోనానే కాదు వేడి కూడా భూగోళాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రికార్డయిన అత్యంత వేడి సంవత్సరాల్లో 2020 కూడా ఒకటి అని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. గతేడాది లా నినా ఏర్పడినప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. పారిశ్రామికీకరణకు ముందు (1850-1900) ఉన్న ఉష్ణోగ్రతల కంటే గతేడాది సగటున 1.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువ నమోదైనట్లు చెప్పింది. దంచికొట్టిన ఎండలతోపాటు కరోనా కోట్లాది మంది ప్రపంచ దేశాల ప్రజలను ఆగం చేసింది.
అత్యంత వేడి దశాబ్దం
2015 నుంచి ఆరేళ్లు రికార్డులో నమోదైన అత్యంత వేడి సంవత్సరాలు కావడం గమనార్హం. 2011-2020 రికార్డులో నమోదైన అత్యంత వేడి దశాబ్దంగా నిలిచింది. 1993లో తొలిసారి ప్రపంచ వాతావరణ సంస్థ వాతావరణ నివేదికను వెలువరించింది. ఈ 28 ఏళ్లలో వాతావరణ వ్యవస్థను అర్థం చేసుకున్నా, అప్పటికీ ఇప్పటికీ పెరిగిపోయిన కంప్యూటింగ్ పవర్ను తీసుకున్నా మానవాళికి ఇచ్చే సందేశం ఒక్కటే. అది రానున్న 28 ఏళ్లకు కూడా మా దగ్గర డేటా ఉంది. వాటిని బట్టి ఉష్ణోగ్రతలు ఇలా పెరిగిపోతూనే ఉంటాయని స్పష్టమవుతోంది అని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెటెరి తాలస్ చెప్పారు.
సమయం లేదు
భూఉపరితలం, సముద్రంపై ఉష్ణోగ్రతల పెరుగుదలతోపాటు సముద్ర మట్టాల పెరుగుదల, మంచు భారీగా కరిగిపోవడం, వర్షపాతం నమూనాలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తాలస్ తెలిపారు. ప్రపంచ వాతావరణ స్థితి 2020 పేరుతో ఈ రిపోర్ట్ వెలువడింది. ఈ నెల 22-23 తేదీల్లో అమెరికా అధ్యక్షతన జరగబోయే వాతావరణ సదస్సుకు ముందు ఈ రిపోర్ట్ వెలువడటం గమనార్హం.
ఈ శతాబ్దం ముగిసేలోపు ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామికీకరణ కంటే ముందు ఉన్న ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువకే పరిమితం చేయాలన్న ప్యారిస్ ఒప్పందానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్న లక్ష్యంతో వాతావరణ సదస్సు జరగబోతోంది. వాతావరణం చాలా వేగంగా మారిపోతోందని, వృథా చేసేంత సమయం మన దగ్గర లేదని తాలస్ ఈ సందర్భంగా చెప్పారు. 2050 కల్లా సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యానికి దేశాలు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.