న్యూఢిల్లీ: ఇండియాలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కొవిడ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర సుమారు రూ.750 ఉంటుందని దేశీయ తయారీదారు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. ప్రముఖ న్యూస్ చానెల్ ఎన్డీటీవీతో ఆ సంస్థ ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. మే-జూన్ నాటికి కొన్ని లక్షల డోసుల వ్యాక్సిన్లు దిగుమతి అవుతాయని తెలిపారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత ఇండియాలో అనుమతి పొందిన మూడో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి.
మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తుండటంతో స్పుత్నిక్ వి అందుబాటులోకి రావడం ఊరట కలిగించే విషయమే. ఇక ఈ వ్యాక్సిన్ డోసు గరిష్ఠ ధర మాత్రం పది డాలర్లే ఉంటుందని జీవీ ప్రసాద్ స్పష్టం చేశారు. దిగుమతి అయ్యే వ్యాక్సిన్లు మొదట కేవలం ప్రైవేట్ మార్కెట్ కోసమేనని ఆయన చెప్పారు. అన్ని దేశాల్లో వ్యాక్సిన్ ధర ఒకేలా ఉండాలని మా భాగస్వామి భావిస్తున్నారు. అంతర్జాతీయంగా దీని ధర 10 డాలర్లుగా ఉంది. ఇండియాలోనూ అదే పరిమితి ఉంటుంది అని ఆయన అన్నారు.
ఇండియాలో తయారీని ప్రారంభించిన తర్వాత పరిస్థితులను బట్టి అప్పటి ధరలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ తయారీ ప్రారంభించిన తర్వాత పబ్లిక్ మార్కెట్లకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. మొదట్లో స్పుత్నిక్ వి దిగుమతుల తర్వాత డాక్టర్ రెడ్డీస్ వాటిని ఇక్కడే పూర్తి స్థాయిలో తయారు చేయనుంది. ఇండియాలో వాటి తయారీ ప్రారంభమైన తర్వాత ధర తగ్గే అవకాశం ఉందని జీవీ ప్రసాద్ వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకూ ఉన్న వ్యాక్సిన్లలో స్పుత్నిక్ విదే అత్యధిక ధర కావడం గమనార్హం. తాజాగా కొవిషీల్డ్ను ప్రైవేట్ మార్కెట్లో రూ.600కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు ఇస్తామని సీరమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రానికి ఇప్పటికీ రూ.150కే డోసు లెక్కన ఈ సంస్థ పంపిణీ చేస్తోంది.