కరీంనగర్/పెద్దపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ/పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల అంకానికి తెరపడింది. ఈ నెల 18న మొదలైన స్వీకరణ ప్రక్రియ, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరి రోజు జాతరలా సాగింది. ఈ ఒక్కరోజే ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్ స్థానానికి 27 మంది 32 సెట్లు దాఖలు చేయగా, పెద్దపల్లి స్థానానికి 22 మంది 54 సెట్లు దాఖలు చేశారు. మొత్తంగా వారం రోజుల్లో కరీంనగర్ స్థానానికి 54 మంది 94 సెట్లు దాఖలు చేయగా, పెద్దపల్లి స్థానానికి 63 మంది 109 సెట్లు వేసినట్లు అధికారులు తెలిపారు. కాగా నేడు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు.
29 వరకు ఉప సంహరణకు గడువు ఇచ్చారు. అయితే దళిత బహుజన సమాజ్పార్టీ అభ్యర్థిగా మాతంగి హన్మయ్య మధ్యాహ్నం 3.01గంటలకు, స్వతంత్ర అభ్యర్థిగా దాసరి శ్రీకాంత్ 3.02 గంటలకు పెద్దపల్లి స్థానానికి గాను నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్కు రాగా, అప్పటికే సమయం దాటిపోవడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.