కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ): ‘గతంలో మీరు ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా సాధించి వెయ్యి కోట్ల నిధులు తెచ్చిన. జాతీయ రహదారుల కోసం కొట్లాడిన. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వేలైన్కు నిధులు మంజూరు చేయించిన. కానీ ఐదేండ్ల కిందట గెలిచిన బండి సంజయ్ కొత్త పనులు దేవుడెరుగు మా హయాంలో చేపట్టిన వాటిని కూడా కొనసాగించలేదు. ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? తేల్చుకోవాలి’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో కూడా ప్రజలకు ఒరిగిందేమీలేదని, ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నది.. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శనివారం కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారుతో అభివృద్ధి జరుగదనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ‘ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, తాను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని సీఎం రేవంత్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను వినోద్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూటకపు గ్యారెంటీలు చెప్పి ఓట్లు కొల్లగొట్టిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం ముక్కోటి దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆయన మాటలు ప్రజలు నమ్మబోరన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించానని, ఏడాదిలోగా ఈ లైన్ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఐదు జాతీయ రహదారులు మంజూరు చేయిస్తే మూడింటి పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన రెండింటి గురించి ఇప్పటి ఎంపీ సంజయ్ పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గెలిచిన వెంటనే ఈ రెండు జాతీయ రహదారులతో పాటు కరీంనగర్, కాజీపేట రైల్వేలైన్ సాధిస్తానని, గ్రామీణ యువతలో వృత్తి నైపుణ్యాల పెంపునకు సింగపూర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కు అనుసంధానంగా ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని తెలిపారు.
తన హయాంలోనే దీనిని ప్రతిపాదించానని, 150 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించానని వెల్లడించారు. ఆ తర్వాత గెలిచిన సంజయ్ దీని గురించి పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్లో 30 లక్షల మంది ఇతర రాష్ర్టాలు, దేశాల యువత ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తే అలాంటి ఉద్యోగాలు మన వాళ్లకే వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. బండి సంజయ్ అసమర్ధతతో కరీంనగర్ పార్లమెంట్లో అభివృద్ధి నిలిచి పోయిందని ఆక్షేపించారు. కేబుల్ వంతెన గురించి బండి ఆలోచించేవాడా? స్మార్ట్సిటీకి నిధులు తెచ్చేవాడా? అంటూ ప్రశ్నలు సంధించారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని, 20 వేల మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉన్నా సరఫరాలో విఫలమవుతున్నదని విమర్శించారు. ప్రధాని మోదీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఎన్నికల టైంలో సీఎం రేవంత్రెడ్డి తమ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేర్పించుకున్నాడని మండిపడ్డారు. వారి నమ్మక ద్రోహం తనకు బాధేసిందన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు కసితో పని చేస్తున్నారని, కార్పొరేటర్లు పార్టీ మారినా వారు తమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. నగర ప్రజలు కూడా తమకే మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్లో చేరి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కాంగ్రెస్లో చేరిన ఎనిమిది మంది పూర్వం అదే పార్టీకి చెందిన వారని, 2014లో 2018లోనూ వీరంతా కాంగ్రెస్లో ఉన్నారని, అప్పుడు పార్టీ మూడోస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారన్నారు. 2023లో తన కోసం పనిచేసిన వీరి డివిజన్లలో వెయ్యేసి ఓట్లు మైనస్ అయ్యాయన్నారు.
వీరు ఎటుంటే అటు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. అవకాశ వాద రాజకీయాలతో వెన్నుపోటు పొడవడం వెనుక ఉన్న మర్మం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వీళ్లందరిని కొనుగోలు చేసిందని ఆరోపించారు. అవకాశవాదుల పట్ల కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని చూసి నగర ప్రజలంతా తమ వెంటే ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపు ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, పార్టీ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు పొన్నం అనిల్కుమార్, రాజేందర్ రావు, మధు ఉన్నారు.