ప్రభాస్ హీరోగా 2011లో విడుదలై ఘన విజయం సాధించిన క్లాసిక్ బ్లాక్బస్టర్ మూవీ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) కాపీరైట్ వివాదానికి సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజుపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణను పునఃప్రారంభించాలంటూ రచయిత్రి ముమ్మూడి శ్యామల రాణి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కాపీరైట్ వివాదంలో దిల్ రాజుకు అనుకూలంగా గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్పై ఉన్న స్టే అధికారికంగా యథావిధిగా కొనసాగనుంది. ఈ తీర్పుతో దిల్ రాజుకు చట్టపరంగా భారీ ఊరట లభించినట్లయింది.
అసలు వివాదం ఏమిటి?
‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథ తన రచన నుంచి దొంగిలించబడిందని ఆరోపిస్తూ రచయిత్రి ముమ్మూడి శ్యామల రాణి కోర్టులో కేసు వేశారు. తన కథను ఎలాంటి అనుమతి లేకుండా, తనకు క్రెడిట్ ఇవ్వకుండా సినిమాగా మలుచుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొందరిపై ట్రయల్ కోర్టులో క్రిమినల్, కాపీరైట్ ఉల్లంఘన కింద కేసులు నమోదు జేశారు.
అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ నిర్మాత దిల్ రాజు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే దిగువ కోర్టు విచారణను కొనసాగించాలని ఆదేశించడంతో వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. ఈ వివాదంపై చట్టపరమైన పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా వివిధ న్యాయస్థానాలలో కొనసాగుతూనే ఉంది.
ఇక హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ, తనపై ట్రయల్ కోర్టులో విచారణ మళ్లీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రచయిత్రి ముమ్మూడి శ్యామల రాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె వయసు 71 ఏళ్లు కావడంతో కేసును త్వరగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) రచయిత్రి వాదనలను తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ను పునఃప్రారంభించాలన్న ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తూ, గతంలో ఉన్న స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ సుదీర్ఘ కాపీరైట్ వివాదంలో నిర్మాత దిల్ రాజుకు చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది.