చెన్నై: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ టీమ్ ఎమర్జింగ్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్దత్ పడిక్కల్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈసారి బెంగళూరు టీమ్ అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. గతేడాది టోర్నీలోనూ పడిక్కల్ నిలకడగా రాణించాడు. ఈ మధ్యే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 737 పరుగులతో టోర్నీలో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక టోర్నీ తొలి మ్యాచ్కు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో పడిక్కల్కు కరోనా ఆ టీమ్కే కాదు ఐపీఎల్ నిర్వాహకులకు కూడా మింగుడు పడనిదే.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్ కూడా శనివారం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఇంతకుముందు కొవిడ్ పాజిటివ్గా తేలిన కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ నితీష్ రాణా.. దాని నుంచి కోలుకొని మళ్లీ టీమ్తో చేరాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ను కరోనా వదల్లేదు. కంటెంట్ టీమ్లోని సభ్యుడు ఒకరు కరోనా బారిన పడ్డాడు. గతేడాది యూఏఈలో టోర్నీ సందర్భంగానూ చెన్నై టీమ్ను కరోనా కలవరపెట్టింది. ఢిల్లీ, చెన్నై మధ్య మ్యాచ్కు వేదికైన వాంఖడే స్టేడియంలో సిబ్బంది కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్లేయర్స్కు కూడా ఈ మహమ్మారి సోకుతుండటం నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవికూడా చదవండి..