నల్లగొండ రూరల్, మార్చి 31 : వాణిజ్య వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రేడియం రిఫ్లెక్సటర్ స్టిక్కర్లపై డీలర్లు, కాంట్రాక్టర్లు నిర్ణయించిన అధిక ధరల, పరిమిత వ్యవస్థపై ప్రభుత్వం పరిశీలించి వాహనదారులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం నల్లగొండ పట్టణంలోని నల్లగొండ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు యేన్న అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందుటకు రవాణా శాఖ నియమించిన కాంట్రాక్టర్ల ద్వారా మాత్రమే రేడియం స్టిక్కర్లు కొనుగోలు చేయవలసి వస్తుందన్నారు. దీంతో ఈ డీలర్లు నిర్ణయించిన ధరలు ఓపెన్ మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంతో సాధారణంగా వెయ్యి వరకు వచ్చే స్టిక్కర్లు రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు వసూలు చేయబడుతున్నాన్నారు.
ఈ విధానంతో ఒకటి, రెండు వాహనాలు కలిగి ఉన్న యజమానులు, స్వయం ఉపాధి డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనియెడల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఇదే విషయంపై నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ జావీద్, కోశాధికారి మారెడ్డి వెంకట్ రెడ్డి, బొడ్డు వెంకన్న, ఏజస్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.