గుర్రంపోడు, మార్చి 31 : ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. మంగళవారం గుర్రంపోడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అష్మిత (19)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే 108 అంబులెన్స్లో నల్లగొండకు బయల్దేరగా మార్గమధ్యంలో అష్మితకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గిరి, పైలట్ వెంకట్ సహాయంతో అంబులెన్స్లోనే డెలివరీ కిట్ ఉపయోగించి ప్రసవం చేశారు. అనంతరం నవజాత శిశువుకు తగిన పరిచర్యలు చేస్తూ, ఆక్సిజన్ అందిస్తూ సురక్షితంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి ఆస్పత్రి వైద్యులు, అష్మిత కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.