బెంగుళూరు: జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న.. ఓ రేప్ కేసులో జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే బెంగుళూరు జైలులో ఉంటున్న అతని వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక రెయిడ్ నిర్వహించారు. ఆ సమయంలో ప్రజ్వల్ రేవన్న వద్ద ఫోన్ ఉన్నట్లు తేల్చారు. క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జైలులోపలికి ఎలా అతను ఫోన్ తీసుకువచ్చాడన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో అధికారులు ఓ సీనియర్ జైలు ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజ్వల్ రేవన్న సెల్లో లోపాలు ఉన్నట్లు పోలీసులు నోటీసు ఇచ్చారు. జైల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎర్రన్న రంగాపూర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇదే కేసులో జైలు సూపరింటెండెంట్ అన్షుచ్ కుమార్కు షోకాజు నోటీసు జారీ చేశారు. భద్రతా లోపం వల్ల వివరణ ఇవ్వాలని కోరారు.
మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ మనువడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మేనల్లుడు అయిన ప్రజ్వల్ రేవన్నకు రేప్ కేసులో జీవితకాల శిక్ష పడింది. 48 ఏళ్ల మహిళను అత్యాచారం చేసిన కేసులో వీడియోలను సర్క్యూలేట్ చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. హసన్ జిల్లాలోని హోలెనరసిపురలో ఉన్న రేవన్న ఫ్యామిలీ ఫార్మౌజ్లో ఆమె పనిమనిషిగా చేశారు. 2021 నుంచి ప్రజ్వల్ రేవన్న తనను రేప్ చేసినట్లు ఆమె ఆరోపించారు. వీడియోలను రికార్డు చేసిన అతను.. ఎవరికైనా చెబితే వాటిని రిలీజ్ చేస్తానని బెదిరించాడు. అత్యాచార ఆరోపణలు రావడంతో అతను జర్మనీకి వెళ్లాడు. ఆ తర్వాత జేడీఎస్ అతన్ని సస్పెండ్ చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అతను ఓటమి చెందాడు. జర్మనీ నుంచి రాగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అత్యాచార నిందితుడుకి జైలులో వీఐపీ సేవలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో అందరూ ప్రశ్నిస్తున్నారు. బెంగుళూరు సెంట్రల్ ప్రిజన్లో ఉన్న వీఐపీ ప్రత్యేక వసతుల గురించి విమర్శలు వస్తున్నాయి. పర్సనల్ మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డివైస్లను జైళ్లలో బ్యాన్ చేశారు.